కాంగ్రెస్ ది అక్రమ సంబంధం: బీజేపీ ఫైర్
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికెలో బీజేపీ అధికారంలోకి రాకుండ చూడటానికి కాంగ్రెస్ అప్పుడే నాటకాలు మొదలు పెట్టింది. ఎలాగైనా జేడీఎస్ పార్గీతో పొత్తు పెట్టుకుని బీబీఎంపీలో అధికారంలో ఉండాలని ప్లాన్ వేసింది.
బీబీఎంపీ ఎన్నికలలో బీజేపీకి 100 సీట్లు, కాంగ్రెస్ కు 76 సీట్లు, జేడీఎస్ కు 14 సీట్లు వచ్చాయి. 8 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బీబీఎంపీలో అధికారంలోకి రావడానికి బీజేపీకి సైతం పూర్తి మెజారిటి లేదు. హలసూరులో స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపోందిన మమతా శరవణ బీజేపీలో చేరిపోయారు.
బుధవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు జేడీఎస్ నాయకులతో చర్చించారు. బీబీఎంపీలో బీజేపీ అధికారంలోకి రాకుండ చూడాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం జేడీఎస్ శాసన సభ్యుడు జమీర్ అహమ్మద్ మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్.డి. దేవేగౌడ ఇంటికి వెళ్లి ఈ విషయంపై చర్చించారు.
అదే సమయంలో జేడీఎస్ శాసన సభ్యుడు వై.ఎస్.వి. దత్తా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చించారు. తరువాత బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రి రామలింగారెడ్డి సైతం సిద్దరామయ్యను కలిశారు. అనంతరం రామలింగా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముందు ఏమి జరుగుతుందో మీరే చూడండి అన్నారు.
జమీర్ అహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ మతతత్వ పార్టీ బీజేపీని బీబీఎంపీ మేయర్ కుర్చిలో కుర్చోపెట్టడానికి తాము అంగీకరించమని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ దోస్తి ఉంటుందని చెప్పారు. సాయంత్రం కచ్చితమైన సమాచారం ఇస్తామని చెప్పారు.
బీజేపీ 100 కార్పొరేటర్లతో సహ ఆ పార్టీ ఎంపీలు, శాసన సభ్యులు కలిస్తే 124 ఓట్లు వస్తాయి. కాంగ్రెస్, జేడీఎస్ కలిస్తే 130 ఓట్లు వస్తాయి. బెంగళూరు మేయర్ స్థానం కాంగ్రెస్ కు, డిప్యూటి మేయర్ స్థానం జేడీఎస్ కు వచ్చే విదంగా ప్లాన్ వేశారు.
వీరి అక్రమ కలయికమై మాజీ డిప్యూటీ సీఎం ఆర్. అశోక్ తో పాటు బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం కోసం కాంగ్రెస్ అక్రమ సంబంధానికి పాల్పడుతుందని విరుచుకుపడ్డారు. బెంగళూరు ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.