మే 23 లోక్ సభ ఫలితాలు, మే 21 కర్ణాటకలో పోటాపోటీగా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేల సమావేశాలు !
బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేది ప్రకటించనున్నారు. అయితే అంతకు ముందే కర్ణాటకలో రాజకీయాలు వాడివేడిగా జరగడానికి రంగం సిద్దం అయ్యింది. మే 21వ తేదీ బెంగళూరులో జరిగే బీజేపీ శాసన సభ్యుల సమావేశానికి హాజరుకావాలని ఆపార్టీ ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప పిలుపునిచ్చారు.
చేత కాకపోతే చేతులకు గాజులు వేసుకోండి, బీజేపీ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు, మీజీ సీఎం ఫైర్!
మే 21వ తేదీ జేడీఎస్ మంత్రులు, శాసన సభ్యుల సమావేశానికి హాజరు కావాలని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో మే 21 తేదీ వాడివేడిగా చర్చలు జరగడానికి రంగం సిద్దం అయ్యింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి.
అసమ్మతి ఎమ్మెల్యేలు
మే 23వ తేదీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఇంతకాలం బీజేపీ నాయకులు చెప్పారు. 21వ తేదీ జరిగే ఎమ్మెల్యేల సమావేశంలో ఇదే విషయంపై శాసన సభ్యుల అభిప్రయాలు సేకరించడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటక ప్రత్యేకం
కర్ణాటకలో లోక్ సభ ఎన్నికలతో పాటు రెండు శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు మే 23న ప్రకటించనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత మనం ఏం చెయ్యాలి అంటూ బీఎస్. యడ్యూరప్ప బీజేపీ శాసన సభ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి సిద్దం అయ్యారని సమాచారం.
జేడీఎస్ ఎమ్మెల్యేలు
మే 21వ తేదీ బెంగళూరులో బీజేపీ శాసన సభ్యుల సమావేశం జరగనుంది. మే 21వ తేదీ బెంగళూరులో జరిగే శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. రెండు పార్టీల శాసన సభ్యుల సమావేశం ఒకే రోజు వేర్వేరుగా జరుగుతున్న సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
బీజేపీ లీడర్స్ విశ్వాసం
మే 23వ తేదీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో రచ్చ మొదలౌతుందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఆ సమయంలో మనం ఏం చేస్తే బాగుటుందని అని చర్చించడానికి మాజీ సీఎం యడ్యూరప్ప శాసన సభ్యుల సమావేశానికి పిలుపునిచ్చారని సమాచారం. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని సమాచారం.
కాంగ్రెస్ కు గుబులు
కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయిన ఆ పార్టీ గోకాక్ ఎమ్మెల్యే రమేష్ జారకి హోళి తన నిర్ణయాన్ని మే 23వ తేదీ ప్రకటిస్తానని అంటున్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఇప్పటికే ఆయన అన్నారు. అయితే తాను ఒక్కడే పార్టీకి రాజీనామా చేస్తే ఫలితం ఏమి ఉంటుందని, ఆరోజు ఏం జరుగుతుందో మీరే చూస్తారని రమేష్ జారకిహోళి బాంబు పేల్చారు. రమేష్ జారకిహోళి మాటలతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుబులు మొదలైయ్యింది.
మాజీ ప్రధాని స్కెచ్
బీజేపీ శాసన సభ్యుల సమావేశం ఒక వైపు జరగడానికి ఏర్పాట్లు జరుగుతుంటే అదే రోజు జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడానికి మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ సిద్దం అయ్యారు. దళపతి హెచ్.డి. దేవేగౌడ జేడీఎస్ ఎమ్మెల్యేలతో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయం ఆసక్తిగా మారింది. బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేల సమావేశాల్లో ఏం చర్చ జరుగుతందో అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.