15రోజుల్లో 104ను 111 చేస్తారా?: యడ్యూరప్పకు చిదంబరం చురక
న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ విజుభాయి వాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేకున్నా బీజేపీని ఆహ్వానించడమంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఫిరాయింపులకు మద్దతిచ్చినట్లేనని ఆరోపిస్తోంది.
కాంగ్రెస్-జేడీఎస్ కలిసి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే అవకాశం ఇవ్వకుండా, బీజేపీకి తొలి ప్రాధాన్యత ఇవ్వడమేంటని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత, న్యాయవాది కూడా అయిన చిదంబరం ప్రశ్నించారు.

'15రోజుల్లో యడ్యూరప్పను మెజార్టీ సాధించాలంటూ గవర్నర్ అవకాశం ఇచ్చినట్లుంది. గవర్నర్ ఆహ్వానంతో.. 15రోజుల్లో బీజేపీకి దక్కిన 104స్థానాలను 111గా యడ్యూరప్ప మార్చేస్తారు?' అంటూ చిదంబరం ఎద్దేవా చేశారు. గవర్నర్ ఆహ్వాన లేఖ కాపీని కూడా ఆయన ట్వీట్ చేశారు.
స్పష్టమైన మెజార్టీ కలిగి ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. తమకు మెజార్టీ ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడం అక్రమమని మరో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అన్నారు.












Click it and Unblock the Notifications