పెళ్లి ఖర్చులు: అసెంబ్లీలో రాత్రంతా యెడ్యూరప్ప ధర్నా
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కెజెపి అధ్యక్షుడు యడ్యూరప్ప అసెంబ్లీలో బైఠాయించారు. వివాహ ఖర్చుల కోసం ముస్లిం యువతులకు యాభై వేల రూపాయలు ఇస్తున్నట్లుగానే అన్ని వర్గాలకు ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఆయన అసెంబ్లీలో నిరవధిక ధర్నా చేపట్టారు.
సోమవారం రాత్రంతా ధర్నా జరిపిన ఆయన మంగళవారం కూడా కొనసాగించారు. ‘షాదీ భాగ్య యోజన' పథకాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం అన్ని వర్గాలకు వర్తింపజేయని పక్షంలో అసెంబ్లీలోని పోడియం వద్ద ధర్నాకు దిగుతానని యెడ్యూరప్ప హెచ్చరించారు.
యెడ్యూరప్ప మంగళవారం ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా ధర్నాను మాత్రం కొనసాగించారు. బెంగళూరులో 26 రోజుల ధర్నా చేపట్టిన యెడ్యూరప్ప తన వేదికను బెల్గామ్కు మార్చారు. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్యగానీ, ఆయన మంత్రివర్గ సహచరులు గానీ తనను సంప్రదించలేదని పేర్కొన్నారు.
వివాహ సహాయ పథకానికి తాను వ్యతిరేకించడం లేదనీ, అలాగే మైనార్టీలకు ఇవ్వరాదని కూడా తన ఉద్దేశం కాదని యెడ్యూరప్ప చెప్పారు. అన్ని వర్గాలకు ఈ పథకాన్ని విస్తరింపజేయాలన్నదే తన డిమాండ్ అని పేర్కొన్నారు. వివాహ పథకాన్ని అన్ని వర్గాలకు వర్తించే విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు.