సిద్ధరామయ్యకు అస్వస్థత, ఆస్పత్రిలో పరామర్శించిన సీఎం యడియూరప్ప, మంత్రులు
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య అస్వస్థతకు గురవడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఛాతీలో నొప్పి వచ్చిందని చెప్పడంతో బుధవారమే హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.
సిద్ధరామయ్య అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న సీఎం యడియూరప్ప పరామర్శించేందుకు వచ్చారు. తమ సహాచర మంత్రులు కేఎస్ ఈశ్వరప్ప, బసవరాజ బొమ్మైతో కలిసి యడియూరప్ప ఆస్పత్రికి వచ్చారు. సిద్ధరామయ్యను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్యులను కూడా ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
సిద్ధరామయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని కుమారుడు యతీంద్ర సిద్దరామయ్య పేర్కొన్నారు. ఇదివరకే ఆయనకు అంజియోప్లాస్ట్ చేయించుకున్నారని తెలిపారు. ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకొచ్చామని... డాక్టర్ రమేశ్ నేతృత్వంలోని వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
సిద్ధరామయ్య గుండెకు రక్త సరఫరాలో సమస్య తలెత్తిందని వైద్యులు చెప్పారని వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు మరోసారి అంజియోప్లాస్టీ చేయించామని యతీంద్ర స్పష్టంచేశారు.