తెగబడ్డ పాకిస్తాన్... బోర్డర్లో స్పై డ్రోన్... షూట్ చేసి కూల్చిన బీఎస్ఎఫ్..
ఓవైపు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరోవైపు పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శనివారం తెల్లవారుజామున 5గంటలకు పాకిస్తాన్కు చెందిన ఓ డ్రోన్ జమ్మూకశ్మీర్లోని హీరానగర్ సెక్టార్లో ఉన్న ఇంటర్నేషనల్ బోర్డర్ వెంబడి ఎగరడాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. దీంతో వెంటనే అప్రమత్తమై... 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జరపగా డ్రోన్ కుప్పకూలింది.

స్పై డ్రోన్.. మారణాయుధాలు స్వాధీనం..
కూలిన డ్రోన్ను పరిశీలించగా.. అది ఆయుధాలను తరలిస్తున్నట్టు గుర్తించారు.డ్రోన్తో పాటు ఏడు గ్రెనేడ్లు,రైఫిల్స్,రెండు మేగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో రహస్యంగా ఫోటోలు తీసేందుకే పాక్ డ్రోన్ను పంపించి ఉంటుందని అనుమానిస్తున్నారు. హీరానగర్లోని రథువా గ్రామానికి సమీపంలో ఇంటర్నేషనల్ బోర్డర్ నుంచి 250 మీటర్ల ఎత్తులో డ్రోన్ ఎగిరినట్టు బీఎస్ఎఫ్ వెల్లడించింది.

మరోవైపు కాల్పులు...
సరిహద్దులో స్పై డ్రోన్ను షూట్ చేసిన కొద్ది గంటలకే 8.50గం. ప్రాంతంలో హీరానగర్ సెక్టార్లోని బబియా పోస్ట్ వద్ద పాకిస్తాన్ కాల్పులకు తెగబడినట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అయితే బీఎస్ఎఫ్ వైపు నుంచి ప్రతిదాడి చేయలేదని.. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

అటు చైనా.. ఇటు పాక్..
ఓవైపు సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు తెగబడుతుంటే.. మరో పక్కనుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు మిత్ర దేశాలు కలిసి భారత్ను టార్గెట్ చేశాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల లదాఖ్ సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో చైనాతో తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి చైనాను ఎలా ఎదుర్కోవాలని భారత్ సమాలోచనలు జరుపుతున్న వేళ పాకిస్తాన్ నుంచి కూడా కవ్వింపు చర్యలు మొదలవడం గమనార్హం. భారత్ ఈ రెండు దేశాలను మున్ముందు ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications