బీఎస్పీ నేత అఫ్జల్ అన్సారీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు: ఎందుకంటే?
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్వాదీ పార్టీ(BSP) నేత అఫ్జల్ అన్సారీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ని కిడ్నాప్ చేసి, హతమార్చిన కేసులో అఫ్జల్ అన్సారీతోపాటు, అతని సోదరుడు ముఖ్తార్ అన్సారీ కూడా నిందితులుగా ఉన్నారు. ఘజియాపూర్లోని ప్రజాప్రతినిధుల కోర్టు అదనపు సెషన్స్ జడ్జి శనివారం (ఏప్రిల్ 29న) ఈ కేసులో తీర్పు వెలువరించారు.
దోషిగా తేలిన అఫ్జల్ అన్సారీకి నాలుగు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో అన్సారీపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో ఘజియాపూర్ లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్జల్ అన్సారీ ఎంపీ పదవికి అనర్హుడయ్యారు. ఏప్రిల్ 29, 2023 నుంచి ఇది వర్తిస్తుంది అని లోక్సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

కాగా, 1996లో విశ్వహిందూ పరిషత్ నాయకుడు నందకిశోర్ కిడ్నాప్ వ్యవహారం, 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసుల్లో ముక్తార్ అన్సారీ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో 2007లో అతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఇదే అభియోగాలపై ముక్తార్ సోదరుడు అఫ్జల్ అన్సారీపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కొన్నేళ్లపాటు సాగిన ఈ కేసులో వీరిద్దరిని దోషులుగా తేల్చుతూ యూపీ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ముక్తార్ అన్సారీకి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 5 లక్షల జరిమానా, అఫ్జల్కు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది. కాగా, మోడీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీ ఇటీవల తన ఎంపీ అర్హతను కోల్పోయిన విషయం తెలిసిందే. కొద్ది రోజులకే మరో ఎంపీ అన్సారీపై వేటు పడింది.












Click it and Unblock the Notifications