ఏపీపై మోదీ స్పెషల్ ఫోకస్- సంతుష్టీకరణ: తాయిలాలు సిద్ధం?
Union Budget 2025: ఇంకొద్ది రోజుల్లో వార్షిక బడ్జెట్.. పార్లమెంట్ ముందుకు రానుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనపై కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా దాదాపుగా కొలిక్కివచ్చినట్టే.
పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందనేది బహిరంగ రహస్యమే. దేశంలో ట్యాక్స్ టెర్రరిజం కొనాగుతోందని, నానా రకాలుగా ట్యాక్సులను వసూలు చేస్తోన్నారంటూ మొన్నటికి మొన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆరోపణలు గుప్పించారు.

సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న మధ్య తరగతి ప్రజలు లెక్కలేనని పన్నులను చెల్లించాల్సి వస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. టీచర్లు, లాయర్లు, వేతన జీవులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు విపరీతంగా పన్నులను చెల్లిస్తోన్నారని, ఇది ట్యాక్స్ టెర్రరిజమని వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితుల మధ్య కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశం కాబోతోంది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ ఏర్పాటుకానుంది. ప్రదానమంత్రి నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్ ఉభయ సభల ముందుకు రాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మంత్రివర్గం భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2025-2026 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలే ప్రధాన అజెండా. దాదాపుగా తుది రూపాన్ని సంతరించుకుంటోన్న నేపథ్యంలో.. దీనిపై విస్తృతంగా మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు, వ్యవసాయం, రైల్వేలు, జాతీయ రహదారులు వంటి రంగాలకు ఎంత మొత్తంలో బడ్జెట్ను కేటాయించారనే విషయం ప్రధానంగా ప్రస్తావనకు రావొచ్చు.
విద్య, వైద్యం, డిజిటల్ ఇండియా, పీఎంఏవై, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వాటికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు కేటాయించే నిధులపై చర్చ జరగొచ్చు. ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి చెందిన పరిశ్రమలకు రాయితీలను ఇచ్చే అవకాశాలు లేకపోలేదీసారి బడ్జెట్లో. జీఎస్టీ శ్లాబుల విధానం, పన్నులు, వేతన జీవులకు ఊరట కల్పించడం వంటివి చర్చించే అవకాశం ఉంది.
గత ఏడాది తరహాలోనే ఇప్పుడు కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) అధికారంలో ఏపీ, బిహార్లకు అంచనాలకు అనుగుణంగా తాయిలాలను ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలు ఇదివరకే అందజేసిన ప్రతిపాదనలు కూడా మంత్రివర్గంలో చర్చకు వస్తాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications