69 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి ఓ బస్సొచ్చింది
డెహ్రాడూన్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఆ గ్రామానికి మాత్రం రోడ్డు మార్గం లేదు. దీంతో ఆ గ్రామంలోని కొందరు వృద్ధులు తమ జీవితకాలంలో బస్సును చూడలేదు. కానీ 69 ఏళ్ల తర్వాత ఆ గ్రామస్తుల ఎదురుచూపులు ఫలించాయి. ప్రధాన మంత్రి మోడీ పథకంతో ఆ గ్రామానికి బస్సొచ్చింది.
దీంతో ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇదంతా ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని మారుమూలు గ్రామం సిల్పతా సంగతి. కొండ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకంలో భాగంగా సమకూరిన నిధులతో ప్రభుత్వం ఇటీవలే రోడ్డును పూర్తి చేసింది.

చమోలీ జిల్లా కేంద్రానికి, సిల్పతా గ్రామానికి మధ్య దూరం 21 కిలోమీటర్లు కాగా, ఈ గ్రామానికి చేరుకునేందుకు ఎటువంటి రోడ్డుమార్గం లేదు. దీంతో 21 కిలోమీటర్ల రోడ్డు మార్గం కోసం 69 ఏళ్ల పాటు ఆ గ్రామ ప్రజలు ఆత్రుతతో ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 69 ఏళ్ల తర్వాత ఆ మారుమూలు గ్రామస్తుల కోరిక తీరింది.
దీంతో తొలిసారిగా ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్కు చెందిన బస్సు తమ గ్రామానికి వస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు తెగ సంబరపడిపోయారు. బస్సుకు స్వాగతం పలుకుతూ హర్షధ్వానాలు చేసారు. సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆడుతూపాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వాస్తవానికి రెండు సంవత్సరాల క్రితమే ఈ రోడ్డు మార్గం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమైనట్లు గ్రామస్తులు చెప్పారు. అంతేకాదు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మా గ్రామానికి రోడ్డు మార్గం అనే అంశాన్ని ఏ ప్రజాప్రతినిధీ పట్టించుకోలేదని వాపోయారు.
ఇన్నేళ్లకు తమ గ్రామానికి బస్సు వచ్చేలా చేసిన కరణ్ ప్రయోగ్ ఎమ్మెల్యే అనుసూయ ప్రసాద్ మైఖురికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. బస్సు రాకముందు అడవి మధ్యలో గుట్టల మీదుగా నడకదారే శరణ్యమన్నారు.












Click it and Unblock the Notifications