రంగంలో శివసేన, మొదటిసారి కలిసిన కాంగ్రెస్-ఎన్సీపీ: మహారాష్ట్రలో గెలుపు బీజేపీకి కీలకం, కారణాలు ఇవీ
ముంబై: సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికైనా లేక ఉప ఎన్నికైనా అన్ని పార్టీలకు ఎంతో కీలకం. 2014లో మోడీ హవాతో బీజేపీ మూడున్నర దశాబ్దాల తర్వాత అనూహ్య మెజార్టీతో గద్దెనెక్కింది. ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం ఎదురుదెబ్బ తింటోంది. ఈ నేపథ్యంలో 4 లోకసభ, 10 అసెంబ్లీ స్థానాలకు 28న ఉప ఎన్నికలు జరిగాయి. కర్ణాటకలోని రాజరాజేశ్వర నగర్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రద్దయిన ఎన్నిక కూడా జరిగింది.
Recommended Video
వీటిపై అందరి దృష్టి ఉంది. మహారాష్ట్రలో శివసేన గత కొన్నాళ్లుగా బీజేపీపై ఆగ్రహంతో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. అయితే బీజేపీ మాత్రం తమతో కలిసి ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రెండు స్థానాల్లో (పాల్ఘర్, బాంద్రా-గోండియా) ఉప ఎన్నికలు కీలకంగా మారాయి.
పాల్ఘర్లో బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా అభ్యర్థిని బరిలోకి దింపడం గమనార్హం. ఈ రెండు పార్టీలు కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షాలు. ఇటీవలి కాలంలో బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వచ్చే ఏ అవకాశాన్ని కూడా శివసేన వదులుకోవడం లేదు.
ఇప్పుడు పాల్ఘర్లో బీజేపీకి వ్యతిరేకంగా శివసేన అభ్యర్థిని నిలబెట్టింది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇక్కడ గెలుపు ఇద్దరికీ అవసరం. ఎందుకంటే వేర్వేరుగా పోటీ చేస్తామని చెప్పినప్పటికీ.. ఇక్కడ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లను డిమాండ్ చేసేందుకు శివసేనకు ఆస్కారం ఉంటుంది. బీజేపీ గెలిస్తే ఆ పార్టీ పైచేయి సాధిస్తుంది. దీంతో ఎవరు గెలిస్తే వారిది వచ్చే ఎన్నికల సమయంలో పైచేయిగా ఉండే అవకాశముంది.
బాంద్రా - గోండియాలోను ఆసక్తికర పోరు ఉంది. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ -ఎన్సీపీలు కలిసి అభ్యర్థిని నిలబెట్టాయి. గత కొన్నాళ్లుగా బీజేపీ దూకుడును తట్టుకునేందుకు ఏళ్ల తరబడి శత్రుత్వాన్ని పక్కన పెట్టి పార్టీలు ఏకమవుతున్నాయి. ఇక్కడ ఎన్సీపీ- కాంగ్రెస్లు గతంలో లోకల్ బాడీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అసెంబ్లీ, పార్లమెంటు వంటి కీలక ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేదు.
కానీ బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు మొదటిసారి కీలక ఎన్నికల్లో కాంగ్రెస్ - ఎన్సీపీలు కలిశాయి. ఇక్కడ రెండు సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఎంతో కీలకం. పాల్ఘర్లో శివసేన గెలిస్తే బీజేపీ దూకుడు తగ్గుతుంది. బాంద్రా - గోండియాలో విపక్షాల కూటమి గెలిస్తే.. సమష్టిగా బీజేపీని ఎదుర్కోవచ్చునని మరోసారి నిరూపితమవుతుంది.