ఉప ఎన్నికలు: నరేంద్ర మోడీ హవాకు మరో పరీక్ష
న్యూఢిల్లీ: దేశంలో జరిగిన ఉప ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీకి పరీక్షగా భావిస్తున్నారు. దేశంలోని మూడు లోకసభ స్థానాలకు, 33 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పోలింగ్ దాదాపు ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ శాసనసభా స్థానం పోలింగ్ శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోకసభ స్థానం పోలింగ్లో కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటలూ చోటు చేసుకోలేదు.
ఉప ఎన్నికలు పది రాష్ట్ర్లాల్లో జరిగాయి. ఫలితాలు ఈ నెల 16వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం వచ్చే హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలపై ఉండవచ్చునని అంటున్నారు. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిఫలిస్తాయని కూడా అంటున్నారు.
ఇటీవల జరిగిన బీహార్, ఉత్తరాఖండ్ ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి చేదునే అందించాయి. కాంగ్రెసుకు కొద్ది పాటి సీట్లు వచ్చినా ఆ పార్టీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నైతిక స్థయిర్యం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 11 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో మెజారిటీ స్థానాలను బిజెపి గెలుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే, దాని ప్రభావం మోడీ కేంద్ర ప్రభుత్వంపై పడుతుందని అంటున్నారు. అలాగే, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో 9 లోకసభ స్థానాలకు, వడదొర పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల ప్రభావం కూడా మోడీ ప్రభుత్వంపై ఉంటుంది.