సీఏఏను మహారాష్ట్రలో అమలు చేసేదే లేదు: సీఎం ఉద్ధవ్, మంత్రి బాలా సాహెబ్
ముంబై: మహారాష్ట్రలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని శివసేన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత తమ నిర్ణయం చెబుతామన్న మరుసటి రోజే మహారాష్ట్ర సర్కారు ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం.
ముంబైలో ముస్లిం నేతల సమావేశంలో సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో సీఏఏ గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదని అన్నారు. సీఏఏతోపాటు ఎన్ఆర్సీని కూడా మహారాష్ట్రలో అమలు చేయబోమని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర మంత్రి బాలాసాహెబ్ థోరట్ సోమవారం మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎప్పుడూ సెక్యూలర్ ఐడియాలజీని నమ్ముతుందని అన్నారు. కులం, మతం ఆధారంగా రాష్ట్రం విడిపోదని అన్నారు. తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ ఈ దేశ ఆత్మను బాధకు గురిచేస్తోందని అన్నారు. ఈ విషయంలో బీజేపీని వదలిపెట్టమని అన్నారు. మహారాష్ట్రలో సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయబోమని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నేతల ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్లో జరిగిన నిరసన కార్యక్రమంలో థోరట్ పాల్గొన్నారు.
Citizenship amendment act is divisive in nature. We will not implement it in Maharashtra#CAA #NRC#SatyagrahaForUnity pic.twitter.com/3h40m3XG7I
— Balasaheb Thorat (@bb_thorat) December 23, 2019
మరోవైపు ఉద్ధవ్ థాక్రే.. నేషనల్ పీస్ ఫోరం, ముస్లిం సేవా సంఘ్, కాంగ్రెస్ నుంచి అమిత్ పాటిల్, శివసేన నుంచి అబ్దుల్ సత్తార్, సమాజ్ వాదీ పార్టీ నుంచి అబు ఆజ్మీ, ఎన్సీబీ నుంచి నవాబ్ మాలిక్ వంటి ముస్లిం నేతలతో సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్లో సమావేశం నిర్వహించారు. ఏ ముస్లిం కూడా సీఏఏ గురించి ఆందోళన చెందాల్సన అవసరం లేదని చెప్పారు. ఎవరి హక్కులకు భంగం కలగకుండా చూసుకుంటామని అన్నారు.
మహారాష్ట్రలో సీఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేసేది లేదని మరికొందరు శివసేన సీనియర్ నాయకులు కూడా స్ఫష్టం చేశారు. ఇంతకుముందే ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో సీఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేసేది లేదని అన్నారు. బీహార్ లాంటి రాష్ట్రాలే అమలు చేసేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్ర కూడా అదే బాటలో ఉంటుందని చెప్పారు. కాగా, సీఏఏకు మద్దతుగా లోక్సభలో ఓటు వేసిన శివసేన.. రాజ్యసభలో మద్దతు ఇవ్వకుండా ఓటింగ్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.