మోడీ తాజా అస్త్రం: వేల కోట్లు ముంచి పారిపోతే ఇక అంతే! ఆస్తులు అమ్మేయడమే
న్యూఢిల్లీ: వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నిందితులపై నరేంద్ర మోడీ ప్రభుత్వం కొరఢా ఝలిపించేందుకు రంగం సిద్దం చేసింది. బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయేవారిని నేరస్థులుగా ప్రకటించి, వారి ఆస్తులను స్వాధీనం చేకోవడంతోపాటు అమ్మేసి, రుణాలను రాబట్టుకునేందుకు తాజాగా మరో అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.
కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు, 2017ను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిపారు.
ఆస్తుల స్వాధీనం, విక్రయం
వందలు, వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయేవారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, విక్రయించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటవుతుందని అరుణ్ జైట్లీ తెలిపారు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం ఈ కేసులపై విచారణ జరుగుతుందన్నారు. విదేశాలకు పారిపోయినవారి అన్ని ఆస్తులను, బినామీ ఆస్తులతో సహా, జప్తు చేయడానికి ఈ బిల్లు ప్రతిపాదించిందన్నారు.
మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారి..
అంతేగాక, కంపెనీల చట్టాన్ని కూడా సవరిస్తామని జైట్లీ తెలిపారు. కాగా, ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే, చట్టం అయిన తర్వాత విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటివారి ఆస్తులను జప్తు చేసి, అమ్మేసి, రుణాలను రాబట్టుకునేందుకు వీలవుతుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించకుండా, విదేశాలకు పారిపోయేవారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, అమ్మేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించింది.
త్వరితగతిన రుణాల రికవరీ
ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు, 2017 పేరుతో రూపొందిన ఈ బిల్లును గురువారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టవచ్చునని తెలుస్తోంది. పార్లమెంటు ఆమోదం లభించిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేసి, రుణాలను సత్వరం రాబట్టుకునేందుకు వీలవుతుంది.
మూల్యం తప్పదు..
కాగా, షెడ్యూల్డు నేరానికి పాల్పడినందుకు అరెస్టు వారంటు ఎవరికి జారీ అవుతుందో ఆ వ్యక్తి నేర విచారణను తప్పించుకున్నా.. విదేశాలకు పారిపోయి, తిరిగి భారతదేశానికి రావడానికి తిరస్కరించినా.. పలాయనం చిత్తగించిన ఆర్థిక నేరస్థుడిగా పరిగణించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది అమల్లోకి వస్తే వేల కోట్లు ముంచి విదేశాలకు పారిపోయిన మాల్యా, మోడీ లాంటి వ్యాపారస్తులు తగిన మూల్యం చెల్లించుకోకపోతప్పదు.