మహిళలపై మోదీ చిన్న చూపు? -మొన్నటిదాకా నలుగురే -కొత్తగా 7గురితో కలిపి పూర్తి జాబితా ఇదే
ఆడపిల్లల కోసం బేటి బచావో-బేటీ పడావో దగ్గర్నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు అమలు చేస్తోన్న పలు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తుండటం తెలిసిందే. అయితే, పదవుల దగ్గరికొచ్చేసరికి మాత్రం మహిళలపై మోదీ చిన్నచూపు చూస్తున్నారా? అనే సందేహం రాక మానదు. ఎందుకంటే, 2019లో రెండో సారి ప్రధాని అయ్యాక మోదీ తన కేబినెట్ లోకి కేవలం ముగ్గురు మహిళల్నే తీసుకున్నారు. సహాయ మంత్రులుగా మరో ముగ్గురికి అవకాశమిచ్చారు. అకాలీదళ్ ఎన్డీఏ నుంచి విడిపోయి, హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాతో కేబినెట్ ర్యాంక్ మహిళా మంత్రుల సంఖ్య రెండుకు పడిపోయింది. తాజా కేబినెట్ విస్తరణలోనూ మహిళలకు దక్కిన అవకాశం కేలం 14 శాతమే.

ప్రధాని మోదీ తాజాగా చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా కేబినెట్ ర్యాంక్ మహిళా మంత్రుల సంఖ్య రెండుగానే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాత్రమే టాప్-31లో చోటు దక్కించుకున్నారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకా సింగ్ సరుతా సహాయ మంత్రులుగా కొనసాగుతుండగా, కొత్తగా మరో ఏడుగురు మహిళలకు సహాయ మంత్రులుగా పదవులివ్వడంతో మొత్తంగా కేంద్ర కేబినెట్ లో మహిళల సంఖ్య 11కు పెరిగింది. అయినప్పటికీ మహిళా మంత్రులు కేవలం 14 శాతం మాత్రమే. కొత్తగా మంత్రి పదవులు పొందిన ఏడుగురు మహిళల వివరాలివి..
మీనాక్షి లేఖి
న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతోన్న బీజేపి నాయకురాలు మీనాక్షి లేఖికి మోదీ కేబినెట్లో అవకాశం లభించింది. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా అందరికీ సుపరిచితురాలైన మీనాక్షి.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా. జాతీయ మహిళా కమిషన్, బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకూ ఆమె కృషిచేశారు.
శోభ కరంద్లాజే
కర్ణాటకలోని ఉడుపి చిక్మగళూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న శోభ కరంద్లాజేకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. కర్ణాటక సీఎం యెడ్యూరప్పకు సన్నిహితురాలైన శోభ గతంలోనూ కొంతకాలంపాటు కేంద్ర మంత్రిగా పనిచేశారు.
అన్నపూర్ణ దేవి
జార్ఖండ్లోని కొడెర్మా లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న బీజేపీ ఎంపీ అన్నపూర్ణ దేవికి మోదీ కేబినెట్ 2.0లో అవకాశం దక్కింది. 2019 నుంచి మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా, విద్యుత్తు మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యురాలిగా అన్నపూర్ణా దేవి కొనసాగుతున్నారు.
అనుప్రియ సింగ్ పటేల్
ఉత్తర ప్రదేశ్లోని మీర్జాపూర్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్ (ఎస్) పార్టీ తరపున గెలిచిన అనుప్రియ పటేల్ మోదీ తొలి కేబినెట్ లో ఐదేళ్లపాటూ మంత్రిగా కొనసాగారు. 2019లోనూ ఆమెకు పదవి దక్కాల్సి ఉన్నా, సమీకరణాల వల్ల అవకాశం కల్పించలేదు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్నా దళ్ నేత అనుప్రియకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది.
భారతి ప్రవీణ్ పవార్
మహారాష్ట్రలోని డిండోరి (ఎస్టీ) నియోజకవర్గం బీజేపీ ఎంపీ భారతి ప్రవీణ్ పవార్ నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూవర్షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
ప్రతిమ భౌమిక్ :
త్రిపుర (తూర్పు) లోక్ సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ ప్రతిమ భౌమిక్ ఇన్నాళ్లూ రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. తాజా కేబినెట్ విస్తరణలో ఆమెకు సహాయ మంత్రి పదవి దక్కింది.
Recommended Video
దర్శన విక్రమ్ జర్దోశ్
గుజరాత్ లోని సూరత్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న దర్శన విక్రమ్ జర్దోశ్ 2019 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగానూ సేవలు అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications