దేశ ద్రోహులు అన్నా సరే.. అదొక్కటే పరిష్కార మార్గం: ఉగ్రదాడిపై కశ్మీర్ సీఎం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని సంజువాన్ భారత మిలటరీ శిబిరంపై జైషే మహమ్మద్ తీవ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు భారత సైనికులు, ఒక పౌరుడు తమ ప్రాణాలు కోల్పోయారు.
దాడి వెనుక పాకిస్తాన్ శక్తులే ఉన్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్తో చర్చలే దీనికి పరిష్కారమని.. ఈ మాట చెబితే తమను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తారని, అయినా సరే చర్చలు తప్ప మరో మార్గం లేదని కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు.

దేశ ద్రోహులు అన్నా సరే..: మెహబూబా ముఫ్తీ
జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలకు భారత్, పాకిస్తాన్ల చర్చలే పరిష్కారం అని మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు చర్చలు జరపాలని, ఈ పరిస్థితులను నిలువరించడానికి మరో ప్రత్యామ్నాయ మార్గమేమి లేదని అన్నారు.
పాకిస్తాన్తో చర్చలు జరపాలని భారత్ను కోరితే ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు కోరితే.. తమను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని, కానీ చర్చలతోనే ఏదైనా సాధ్యమని అన్నారు.

మూల్చం చెల్లించుకోవాల్సిందే..
సంజువాన్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు నిర్మలా సీతారామన్ సోమవారం జమ్మూలో పర్యటించారు. ఘటనపై ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పాకిస్తాన్ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.

త్యాగాలను వృథా కానివ్వం..:
'ఈ దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్తాన్ ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. మన సైనికుల త్యాగాలను వృథా కానివ్వబోము. ఆర్మీకి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది.' అని సైనికులకు భరోసానిచ్చారు సీతారామన్.

ముగిసిన ఆపరేషన్:
శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు ఆర్మీ శిబిరంపై కాల్పులు జరపగా.. ప్రతిగా భారత సైనికులు కూడా కాల్పులు ప్రారంభించారు. భారత ఆర్మీ కాల్పుల్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమవడంతో సోమవారం ఉదయం ఆపరేషన్ ముగిసింది. తనిఖీలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

దాడిలో పాల్గొన్నది ముగ్గురు:
దాడిలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొనగా.. నాలుగో ఉగ్రవాది శిబిరంలోకి ప్రవేశించలేదని భారత సైనికాధికారులు వెల్లడించారు. అయితే అతను బయటినుంచే ఉగ్రవాదులకు సహకరించి ఉంటాడని వారు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications