వ్యాక్సిన్ల కొరత: రాష్ట్రాల యుద్ధం కారాదు -కేంద్ర సహకారం మస్ట్: అన్ని రాష్ట్రల సీఎంలకు నవీన్ పట్నాయక్ లేఖలు
దేశంలో కరోనా వైరస్ రెండో దశ విలయం ఉధృతి తగ్గకముందే, థర్డ్ వేవ్ సన్నద్ధత గురించి కేంద్రం వివిధ శాఖలను అప్రమత్తం చేస్తున్న తరుణంలో వ్యాక్సిన్ల కొరతపై రాజకీయ దుమారం రోజురోజుకూ పెద్దదవుతోంది. కేంద్రం అనుసరిస్తోన్న జాతీయ వ్యాక్సిన్ విధానంపై ఇటు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తుండగా, అతి ఎక్కువ జానాభా ఉన్న సెక్షన్(18-44 ఏళ్ళ వయసు) వారికి టీకాల బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం తప్పుకోవడం, వ్యాక్సిన్ల కోసం ఆయా రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లినా, కేంద్రం అనుమతి ఉంటేనే ఒప్పందాలని ఆయా సంస్థలు చెబుతుండటం పరిస్థితిని మరింత జఠిలంగా మార్చాయి. ఈ దశలో ముఖ్యమంత్రులు ఒక్కొక్కరుగా మిగతా రాష్ట్రాధినేతలకు లేఖలు రాస్తున్నారు. తాజాగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. దేశంలోని ఇతర సీఎంలకు బుధవారం లేఖలు రాశారు..
మోదీ సర్కారుపై వ్యాక్సిన్ పిడుగు -పూర్తి డేటా హిస్టరీ ఇవ్వండన్న సుప్రీంకోర్టు -అసాధారణ ఆదేశాలు
మోదీ సర్కార్ది నిరంకుశం,అహేతుకం -వ్యాక్సిన్లు అమ్మడమేంటి? -వాళ్లు పౌరులు కారా? : సుప్రీం సంచలనం
ఫెడరల్ వ్యవస్థకు సవాళ్లు..
వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం విధానాలను ప్రశ్నిస్తూ, ప్రధాని మోదీ తీరును ఎడగడుతూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు తీవ్ర స్థాయిలో గళాలు వినిపిస్తున్నారు. రెండ్రోజుల కిందట కేరళ సీఎం పినరయి విజయన్.. బీజేపీయేతర 11 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తూ, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేలా కేంద్రంపై ఉమ్మడిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఇదే తరహాలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కోరారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో అందరికీ వ్యాక్సిన్లు ఇస్తామన్న కేంద్రం మాట మరో జుమ్లా(మోసపూరిత హామీ) లాంటిదేనని బెంగాల్ సీఎం మమత మండిపడ్డారు. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని విపక్షాలు ఆరోపిస్తే, బీజేపీ మాత్రం విపక్షాలే ఆ పనిచేస్తున్నాయని నిందిస్తోంది. సరిగ్గా ఈ దశలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మధ్యేవాదాన్ని, సామరస్యపూర్వక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
నవీన్ హితబోథ..
కేరళ, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల సీఎంలు వ్యాక్సిన్ల విషయంలో కేంద్రంపై దాదాపు యుద్దం ప్రకటించిన దరిమిలా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖలు చర్చనీయాంశం అయ్యాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రానున్న కొవిడ్ వ్యాప్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని, రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి, పంపిణీ చేయాలని నవీన్ కోరారు. స్వాతంత్ర్యం తరువాత దేశం ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య ఇదేనని, కొవిడ్ మహమ్మారి విలయం నుంచి గడ్డెక్కేలా కేంద్రంతో కలిసి నడుస్తూ సహకార సమాఖ్యవాద స్ఫూర్తిని చాటాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు నవీన్ పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్కు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేంత వరకు ఏ రాష్ట్రమూ క్షేమం కాదని, అలాగని వ్యాక్సిన్ల కొనుగోలు అంశం రాష్ట్రాల మధ్య చిచ్చు రేపేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్లు.. రాష్ట్రాల యుద్ధం కారాదు..
''రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదు. కేంద్రం అనుమతిలేకుండా ఒప్పందాలు కుదుర్చోబోమని అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు అంటున్నాయి. వ్యాక్సిన్ల సరఫరాకు రాష్ట్రాలతో ఒప్పందాలు కుదిరినా, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అంటున్నాయి. ఇక్కడేమో దేశీయ ఫార్మా కంపెనీలు అవసరానికి తగ్గట్లు టీకాలను ఉత్పత్తి చేయలేకపోతున్న విషయాన్ని రాష్ట్రాలు గుర్తించాలి. వ్యాక్సిన్ల కొరత రాష్ట్రాల మధ్య లేదంటే రాష్ట్రాలు, కేంద్రం మధ్య యుద్ధంగా మారకూడదు. పరిస్థితులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు కేంద్రంతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసి, పంపిణీ చేస్తే బాగుంటుంది. అయితే, వ్యాక్సినేషన్ విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలి'' అని నవీన్ పట్నాయక్ లేఖలో పేర్కొన్నారు.