కావేరి వివాదం: కేంద్రం చేతిలోకి బంతి
న్యూఢిల్లీ: కావేరీ జలాల పంపిణి వివాదం బంతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో పడింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశం అయ్యి చర్చించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈనెల 30 లోపు తమిళనాడు సీఎం జయలలిత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సమావేశం అయ్యి కావేరీ జలాల విషయంపై క్షుణ్ణంగా చర్చించవలసి ఉంది.
మంగళవారం సుప్రీం కోర్టులో కావేరీ జలాల పంపిణి విషయంపై దాదాపు గంట సేపు వాదనలు జరిగాయి. కావేరీ జలాలు తక్కువగా ఉన్నందున ఆ నీరు కర్ణాటక ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని కర్ణాటక శాసన సభలో తీర్మాణం చేశారని కోర్టులో మనవి చేశారు.
కర్ణాటక ఉభయ సభలు ఏ నిర్ణయం తీసుకున్నా సరే తమిళనాడుకు తాగు నీరు అవసరం ఉందని, మొదట మీరు కావేరీ జలాలు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు కర్ణాటకకు చెప్పింది. కావేరీ జాలల వివాదం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.
ప్రజాస్వామ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించడం మంచిది కాదని, ఈ విషయం మీ ముఖ్యమంత్రికి చెప్పాలని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది నారిమన్ కు సూచించింది.
సెప్టెంబర్ 20వ తేది ఇచ్చిన ఆదేశాలను రద్దు చెయ్యడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అంతకు ముందు కర్ణాటక ఉభయ సభలు సుప్రీం కోర్టు తీర్పును అమలు చెయ్యరాదని తీసుకున్న నిర్ణయంపై వారి మీద చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం మనవి చేసింది.
మొత్తం మీద సుప్రీం కోర్టు ఆదేశాలతో తమిళనాడు ప్రభుత్వం కొంత శాంతించినా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. సుప్రీం కోర్టు ఆదేశాలతో తమిళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కన్నడిగులు మాత్రం షాక్ కు గురైనారు.