ఇలానే కొనసాగితే లాక్డౌన్ తప్పకపోవచ్చు: ఉద్ధవ్ థాక్రే వార్నింగ్, మహారాష్ట్రలో కొత్తగా 47వేల కేసులు
ముంబై: రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి ఇలాగే కొనసాగితే లాక్డౌన్ విధించడం తప్పకపోవచ్చని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్న క్రమంలో శుక్రవారం రాత్రి సీఎం ఉద్ధవ్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. త్వరలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు.
కరోనా చైన్ను ఛేదించడంపై పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్లు సీఎం చెప్పారు. అయితే, తాను కూడా లాక్డౌన్ కోరుకోవడం లేదని, అంతకుమించిన పరిష్కరమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 65 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామన్నారు. గురువారం ఒక్కరోజే 3 లక్షల మందికి టీకా వేసినట్లు చెప్పారు.
వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించకపోవడంతో కొందరు కరోనా బారినపడుతున్నారని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో రోజుకు 2.5 లక్షల కరోనా పరీక్షలు చేయడమే లక్ష్యంగా ఉందన్నారు. కరోనాతో పరిస్థితులు క్షీణిస్తే వైద్య సదుపాయాల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించినట్లు గుర్తు చేశారు. వైరస్ తీవ్రతను బట్టి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.ఇప్పటికే పలు జిల్లాలు, నగరాల్లో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గురువారం 43వేల కేసులు నమోదు కాగా, శుక్రవారం 47వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47,827 కొత్త కేసులు నమోదు కాగా, 202 మరణాలు సంభవించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో కేవలం ముంబైలోనే 8648 కేసులు, 20 మరనాలు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 2,01,58,719 నమూనాలను పరీక్షించగా.. 29,04,079 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో ఇప్పటి వరకు 24,57,494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,89,832 యాక్టివ్ కేసులున్నాయి.