మా నోరు మూయించలేరు: ప్రముఖులపై దేశద్రోహం కేసుపై కొత్త ప్రకటన
ముంబై: దేశంలో జరుగుతున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రముఖులపై దేశద్రోహం నేరం నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, చరిత్రకారుడు రోమిలా థాపర్ తో సహా 180 మంది ప్రముఖులు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
తక్షణమే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో మూకదాడులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణాసేన్, రామచంద్రగుహ, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, రేవతిలతోపాటు 49 మంది సెలబ్రిటీలపై బీహార్లోని ముజఫర్ పూర్లో దేశద్రోహ కేసు నమోదైన విషయం తెలిసిందే.

సాంస్కృతిక కళాకారులపై కేసు నమోదు చేయడం రాజ్యాంగం కల్పించిన భాపప్రకటనా స్వేచ్ఛను అడ్డంగా ఉల్లంఘించడమేని ఆరోపిస్తున్నారు.
ప్రముఖులపై దేశ ద్రోహ ముద్ర వేయడం ఆమోద యోగ్యం కాదని వారంటున్నారు.
పౌరులుగా తమ బాధ్యతను నిర్వర్తించిన వారిని కోర్టులను తప్పుదోవ పట్టించి.. ఇలాంటి చర్యలకు దిగడం సరికాదని వ్యాఖ్యానించారు. అసమ్మతిని తెలిపేవారిని వేధించడానికి కోర్టులను వాడుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన ఓ ప్రకటనలో ఈ మేరకు పేర్కొన్నారు.
సంతకాలు చేసిన వారిలో రచయితలు అశోక్ వాజపేయి, జెర్రీ పింటో, విద్యావేత్త ఐరా భాస్కర్, కవి జీత్ థాయిల్, రచయిత శామ్సుల్ ఇస్లాం, సంగీతకారుడు టీఎం కృష్ణ, ఫిల్మ్ మేకర్ సబా దివాన్ ఉన్నారు.
పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ కాంగ్రెస్ తోపాటు పలు రాజకీయ పార్టీలు కూడా కేంద్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం గమనార్హం.
49మంది ప్రముఖులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయడంపై కేరళ చలనచిత్ర అకాడమీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రగతిశీల రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ఇప్పటికే కోరారు. కాగా, ఈ కేసుతో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఎవరైనా దీనిపై కోర్టుకు వెళ్లవచ్చని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications