బీజేపీలో విలీనం కానున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ: లండన్ నుంచి రాగానే.!
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం లోయర్ బ్యాక్ సర్జరీ కోసం లండన్ వెళ్లిన అమరీందర్ సింగ్.. కోలుకున్న తర్వాత వచ్చే వారం తిరిగి ఢిల్లీకి రానున్నారు. ఆ తర్వాత అమరీందర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్లు తెలిసింది.
గత సంవత్సరం ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. రాష్ట్ర ఎన్నికల ముందు సొంత పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, అనుకున్న రీతిలో అమరీందర్ పార్టీ ఎన్నికల్లో ఫలితాలు చూపలేదు.
ఈ నేపథ్యంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని అమరీందర్ సింగ్ నిర్ణయించారు. ఆయన బీజేపీలో చేరితే ఉపాధ్యక్ష పదవి లభించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. లండన్ నుంచి అమరీందర్ సింగ్ వచ్చిన తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీలో విలీనంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Recommended Video
గత సంవత్సరం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమరీందర్ కు సన్నిహితులైన కీలక కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. పీపీసీసీ మాజీ అధ్యక్షుడు సునిల్ జఖర్ తోపాటు అమరీందర్ కేబినెట్ మంత్రులుగా ఉన్న మజా దళిత నేత రాజ్ కుమార్ వెర్కా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుందర్ శ్యామ్ అరోరా, సిక్కు నేతలు బల్బీర్ సింగ్ సిధ్దు, గుర్ ప్రీత్ సింగ్ కంగర్లు బీజేపీలో చేరారు.