20వేల టన్నుల కరెన్సీ పేపర్ దిగుమతి చేసుకోబోతున్న ఆర్బీఐ!
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో నోట్ల కొరత తీవ్రతరం కావడంతో భారీ సంఖ్యలో నోట్ల ముద్రణ చేపట్టడానికి 20వేల టన్నుల కరెన్సీ పేపర్ ను ఆర్బీఐ దిగుమతి చేసుకోబోతుంది.
న్యూఢిల్లీ: దేశాన్ని వెంటాడుతున్న కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఎక్కువ సంఖ్యలో నోట్ల ముద్రణ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్బీఐ సాధ్యమైనన్ని ఎక్కువ నోట్లు ముద్రించడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అవసరమైన కరెన్సీ పేపర్ ను కూడా దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది.
సాధారణంగా కరెన్సీ ముద్రణ కోసం ఆర్బీఐ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్బీఐఎన్ఎంపీఎల్) తయారు చేసిన పేపర్ నే వాడుతారు. ఆ ప్రకారం ఏటా 18వేల టన్నుల వరకు ఆర్బీఐ నోట్ ముద్రణ్ నుంచే పేపర్ తయారువుతోంది. గత కొన్నేళ్లుగా ఏటా 25వేల టన్నుల పేపర్ ను నోట్ల ముద్రణ కోసం వాడుతూ వస్తున్నారు.
సాధారణ పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం ఆర్బీఐ వద్దనున్న కరెన్సీ పేపర్ వచ్చే ఏడాది సగం వరకు సరిపోయేది. కానీ ప్రస్తుతం నోట్ల డిమాండ్ అధికంగా ఉండటంతో.. అదనంగా మరో 8వేల టన్నుల కరెన్సీ పేపర్ ను త్వరలోనే దిగుమతి చేసుకోవాలని ఆర్బీఐ భావిస్తోంది. మొత్తంగా 20వేల టన్నుల కరెన్సీ పేపర్ ను ప్రస్తుతం ఆర్బీఐ దిగుమతి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని బీఆర్బీఎన్ఎంపీఎల్ స్పష్టం చేసింది.
గతంలో ఇంతకంటే భారీ మొత్తంలో పేపర్ ను దిగుమతి చేసుకున్న సందర్బాలున్నాయని, ఇప్పుడు చాలావరకు ఆర్బీఐ సొంతంగా కరెన్సీ పేపర్ తయారుచేసుకుంటోందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. కాగా, దిగుమతి చేసుకోవాల్సిన కరెన్సీ పేపర్ కు సంబంధించి 9విదేశీ కంపెనీల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆరు కంపెనీలు ఇప్పటికే మనదేశానికి కరెన్సీ పేపర్ ఎగుమతి చేస్తున్నవాటిలో ఉన్నాయి.