గుడ్ న్యూస్.. ఏటీఎం 'విత్ డ్రా'పై ఆంక్షలను పూర్తిగా ఎత్తేయబోతున్నారు..
వచ్చే నెల చివరి నాటికి ఏటీఎం నగదు ఉపసంహరణపై ఆర్బీఐ పరిమితులను ఎత్తివేయనుందని బ్యాంకర్లు తెలిపారు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎం లావాదేవీలపై ఆంక్షలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు అనంతరం నెల రోజుల పాటు కొనసాగిన కష్టాలు ఆ తర్వాత సద్దుమణిగాయి. ప్రస్తుతం ఏటీఎంల ద్వారా రోజుకు రూ.10వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండగా.. మరికొద్ది రోజుల్లో ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ పూర్తిగా ఆంక్షలను ఎత్తివేయనున్నట్టు తెలుస్తోంది.
వచ్చే నెల చివరి నాటికి ఏటీఎం నగదు ఉపసంహరణపై ఆర్బీఐ పరిమితులను ఎత్తివేయనుందని బ్యాంకర్లు తెలిపారు. ఫిబ్రవరి చివరినాటికి లేదా మార్చి తొలి వారానికల్లా.. విత్ డ్రా నిబంధనలు పూర్తిగా సడలించవచ్చునని మహారాష్ట్ర బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తా మీడియాతో పేర్కొన్నారు. అయితే పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాతే కేంద్ర బ్యాంకు దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
కాగా, ఫిబ్రవరి నాటికి 78-88శాతం నగదు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరుతుందని ఎస్.బి.ఐ నివేదికలో వెల్లడైంది. దీంతో రాబోయే రెండు నెలల్లో పరిస్థితి సాధారణ స్థితిని సంతరించుకోనుందని ఎస్.బి.ఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే పరిస్థితి చక్కబడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే, ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాత్రం దీనిపై ఎలాంటి హామి ఇవ్వలేదు. రద్దయిన నోట్లలో 60శాతం వెనక్కి వచ్చిందని, రూ.9.2లక్షల కోట్ల నగదు బ్యాంకులకు తిరిగి చేరిందని ప్రకటించినప్పటికీ, నగదు కష్టాలు తీరే కచ్చితమైన తేదీని మాత్రం సూచించలేకపోయారు.