అక్రమ మైనింగ్: కాంగ్రెస్ ఎంఎల్ఏ కి నో బెయిల్
బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ శాసన సభ్యుడు అనీల్ లాడ్ కు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. శాసన సభ్యుడు అనీల్ లాడ్ ను 14 రోజులు రిమాండ్ కు తరలించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బళ్లారి శాసన సభ్యుడు (కాంగ్రెస్) అనీల్ లాడ్ అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని, అక్రమంగా ఇనుప ఖనిజం విదేశాలకు తరలించారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈనెల 15వ తేదిన విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు సూచించారు.
జులై 15వ తేదిన విచారణకు హాజరైన అనీల్ లాడ్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తరువాత సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. నాలుగు రోజుల పాటు విచారణ చెయ్యడానికి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
కస్టడి అవధి పూర్తి కావడంతో సోమవారం అనీల్ లాడ్ ను కోర్టు ముందు హాజరు పరిచారు. మళ్లి కస్టడికి ఇవ్వాలని సీబీఐ అధికారులు మనవి చేశారు. అయితే కోర్టు అనీల్ లాడ్ ను 14 రోజులు రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేది కోర్టులో సమర్పించాలని న్యాయమూర్తి సూచించారు. మల్లికార్జున షిప్పింగ్ కంపెనీ పేరుతో విదేశాలకు ఇనుప ఖనిజం తరలించారని అనీల్ లాడ్ మీద కేసు నమోదు అయ్యింది.