బ్యాంక్ రుణాల ఎగవేత: పంజాబ్ సీఎం అల్లుడ్ని ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ : బ్యాంకు రుణాలు ఎగవేసిన కేసులో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అల్లుడు గురుపాల్ సింగ్ను గురువారం సీబీఐ ప్రశ్నించింది. సింభోలి షుగర్స్ కంపెనీ బ్యాంకు నుంచి రూ.97.85కోట్లు ఎగవేసిన కేసులో ఆయన నిందితుడని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో ఆ సంస్థ మాజీ ముఖ్య పరిపాలనాధికారి సీఎజీ రావ్ను, ఛైర్మన్ గుర్మిత్ సింగ్ మాన్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గురుపాల్ సింగ్తోపాటు మరికొంతమందిని సీబీఐ ప్రశ్నించింది. దేశంలోని పెద్ద చక్కెర కర్మాగారాల్లో సింభోలి షుగర్స్ లిమిటెడ్ ఒకటిగా ఉంది.
ఈ వ్యవహారంలో కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లలో, ఢిల్లీ, హాపూర్, నోయిడాలోని పలు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. మొత్తంగా రెండు కేసులపై సీబీఐ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొదటిది రూ.97.85కోట్లకు సంబంధించినది కాగా, ఆ రుణాన్ని తీర్చేందుకే మరోసారి రూ.110 కోట్ల కార్పొరేట్ రుణం పొందినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
రెండోసారి తీసుకొని ఎగవేసిన రుణాన్ని నిరర్థక ఆస్తులుగా ప్రకటించారు. మొదట తీసుకొన్న రుణం రూ.97.85కోట్లే అయినా బ్యాంకుకు వాటిల్లిన నష్టం రూ.109.08కోట్లుగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. 2017 నవంబర్ 17 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తాము మోసపోయినట్లు సీబీఐ దృష్టికి తెచ్చింది.