సీబీఐ కోర్టు సంచలనం: లంచగొండి భార్య, కొడుకు, కోడలుకూ శిక్ష
జబల్పూర్: అవినీతికి పాల్పడిన అధికారి మాత్రమే కాదు.. ఆయన అవినీతిని ఆపలేకపోయిన కుటుంబసభ్యులు కూడా నేరస్తులేనంటూ జబల్పూర్ సీబీఐ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సూర్యకాంత్ గౌర్, రూ. 94 లక్షల ప్రభుత్వ నిధులను కాజేశారన్న ఆరోపణలపై కోర్టు విచారించింది.
విచారణ జరిపిన న్యాయమూర్తి యోగేష్ చంద్ర గుప్తా, సూర్యకాంత్తో పాటు ఆయన భార్య వనితా గౌర్, కుమారుడు శిశిర్ గౌర్, కోడలు సునీతా గౌర్లకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2.5 లక్షల చొప్పున జరిమానా విధించారు.
జులై 14, 2010లో సీబీఐ అధికారులు గౌర్ ఇంటిపై దాడులు చేసి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు పెట్టారు. ప్రభుత్వ నిధుల(రూ. 94లక్షల)ను తన ఖాతాలకు తరలించుకున్నాడని పక్కా సాక్ష్యాలు ఉండటంతో కోర్టు ఆయనతో పాటు కుటుంబమంతటికీ శిక్షను విధించింది.
కాగా, ఇంటిల్లిపాదీ జైలుకు వెళ్లడంతో, వారి విజ్ఞప్తి మేరకు శిశిర్ గౌర్ ఐదేళ్ల కుమారుడిని సైతం అధికారులు జైలుకు తరలించారు. అవినీతి అధికారులకు ఈ శిక్ష ఓ గుణపాఠం కావాలని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు.