బొగ్గు కుంభకోణం కేసు: మన్మోహన్ సింగ్కు ఊరట
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరట లభించింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో మన్మోహన్ ప్రమేయం లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ సహా మొత్తం 14 మందిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.
కాగా, బొగ్గు కుంభకోణం కేసులో మధుకోడా అభ్యర్థనకు యోగ్యత లేదని ప్రత్యేక కోర్టుకు సీబీఐ విన్నవించింది. బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్కు సమన్లు జారీ చేయాలని మధుకోడా చేసిన అభ్యర్థనపై సోమవారం ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఈ కేసులో సీబీఐ తన వాదనలు విన్పించింది. జిందాల్ సంస్థకు బొగ్గు కేటాయించాలని మన్మోహన్ సూచించారన్న ఆరోపణలపై ఆధారాల్లేవని పేర్కొంది.
కాగా, ఈ కేసులో మన్మోహన్ సింగ్ను నిందితుడిగా చేర్చాలని మధుకోడా చేసిన వాదనను దాసరి నారాయణరావు సమర్థించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ మన్మోహన్కు క్లీన్ చిట్ ఇవ్వడం ఆయనకు ఉపశమనం కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications