అశోక్ గెహ్లాట్కు షాక్: కృష్ణ పూనియాను గంటలపాటు విచారించిన సీబీఐ
జైపూర్: పోలీసు అధికారి ఆత్మహత్య కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు ప్రత్యేక అధికారిని సీబీఐ మంగళవారం ప్రశ్నించింది. మేలో ఆత్మహత్య చేసుకున్న సదరు పోలీసు అధికారి ఆత్మహత్య కేసులో సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ పూనియాను సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు.
102 ఎమ్మెల్యేల మద్దతు: గవర్నర్ ను కలిసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
రాజస్థాన్ రాజకీయాల్లో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగా ఆ పార్టీకి రెబల్గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సచిన్ పైలట్పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తొలగించింది. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి ఆత్మహత్య కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రికి స్పెషల్ ఆఫీర్ ఆన్ డ్యూటీ దేవారాం సైనీని మంగళవారం సీబీఐ అధికారులు ప్రశ్నించడం గమనార్హం. సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్ జైపూర్ తోపాటు ఢిల్లీలోనూ విచారణ జరిపారు.
మే 23న పోలీస్ ఆఫీసర్ విష్ణుదత్ విష్నో తన అధికారిక నివాసంలో విగత జీవిగా కనిపించారు. దీంతో ఈ కేసును గత నెలలో రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఉన్నతాధికారుల తీవ్రమైన ఒత్తిడి కారణంగానే విష్ణుదత్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కృష్ణ పూనియా కారణంగానే సదరు పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రతిపక్షాలైన బీజేపీ, బీఎస్పీ నేతలు ఆరోపించారు. పూనియా ఆ ఆరోపణలను ఖండించారు. ఈ నేపథ్యంలోనే కృష్ణ పూనియాను తాజాగా సీబీఐ అధికారులు సుమారు 3 గంటలపాటు విచారించారు.
2013లో ఒలింపిక్స్లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన పూనియా.. అదే సంవత్సరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం గెహ్లాట్ టీంతోపాటు జైపూర్లోని ఓ హోటల్లో ఉంటున్నారు పూనియా.