CBSE exam 2021: సంచలనం -పరీక్షల రద్దు ఉండదు, జులైలో నిర్వహణ -రాష్ట్రాల అంగీకారంతో కేంద్రం ప్రకటన
దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతున్నప్పటికీ విద్యార్థుల సుదీర్ఘ భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహణ తప్పదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. 2021 ఏడాదికిగానూ సీబీఎస్ఈసీ బోర్డు పరీక్షలు రద్దు చేయరాదని, ఎలాగోలా పరీక్షలు పెట్టే తీరాలని డిసైడైంది.
Recommended Video
viral video: కలెక్టర్ శర్మ ఓవరాక్షన్ -లాక్డౌన్ పేరిట యువకుడిపై దాడి -వేటేసిన సీఎం -క్షమించాలంటూ..
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు, ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశ పరీక్షల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. కేంద్రమంత్రులు రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్తో పాటు వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర పరీక్షా బోర్డు చైర్మన్లు ఈ భేటీలో పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో సుదీర్ఘంగా సాగిన భేటీలో చివరికి సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయరాదనే నిర్ణయానికి వచ్చారు. అయితే..
కరోనా నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దయిపోగా, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో పరీక్షల నిర్వహణపై కేంద్రం.. అన్ని రాష్ట్రాలు, యూటీల అభిప్రాయాలను సేకరించి, విధివిధానాలను చర్చించడంతోపాటు సలహాలు సూచనలు తీసుకునేందుకు ఇవాళ సమావేశాన్ని నిర్వహించింది. మెజార్టీ రాష్ట్రాలు, యూటీలు పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపడంతో పరీక్షల రద్దు అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను జులైలో నిర్వహించే అవకాశాలున్నాయి. కచ్చితంగా ఏయే తేదీల్లో పరీక్షలు ఉంటాయనేదానిపై కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ జూన్ 1న మీడియాకు వివరాలు అందజేస్తారు. కాగా,
కొవిడ్ వేళ కచ్చితంగా నిర్వహించనున్న 12వ తరగతి పరీక్షలకు ఎలాంటి విధానాలు ఫాలోకావాలనేదానిపై ఆదివారం నాటి భేటీలో కీలక చర్చలు జరిగాయి. 19 ప్రధాన సబ్జెక్టుల్లో పరీక్షల నిర్వహణకు రాష్ట్రాల మద్దతు లభించింది. మిగతా సబ్జెక్టుల్లో ఇంటర్నల్ అసెస్మెంట్ ఎవల్యూషన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదే, ప్రధాన సబ్జెక్టుల్లో పరీక్షను 2.30 గంటలు కాకుండా, కేవలం 90నిమిషాల్లోనే(గంటన్నర లోనే) పూర్తయ్యేలా పరీక్ష నిడివిని తగ్గించాలనే అంశంపైనా చర్చించారు. పరీక్షలు కచ్చితంగా జరుగుతాయన్న విషయాన్ని మాత్రమే చెప్పిన కేంద్రం.. పరీక్షల విధివిధానాలను జూన్ 1న వెల్లడించనుంది. ఇదిలా ఉంటే,
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల రద్దుకు నో చెబుతూ, జులైలో పరీక్షల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతుండగా, కొత్త స్ట్రెయిన్స్ వల్ల పిల్లలు బాధితులయ్యే అవకాశం ఉందని, పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు చేయకుండా కేంద్రం నెలలుగా సాగదీస్తున్నదని, దీంతో విద్యార్థులు ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని ఆమె మండిపడ్డారు. మరోవైపు,
సీబీఎస్ఈ 12 తరగతి పరీక్షలు రద్దు చేయకుండా కచ్చితంగా నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేయడానికి రెండు రోజుల ముందు.. మహారాష్ట్రలో పదో తరగతి పరీక్షలను రద్దుపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పది పరీక్షలు రద్దు చేస్తూ ఉద్ధవ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టింది. ''మీరు విద్యావ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. పాఠశాల విద్యలో ఆఖరుదైన పదో తరగతి చాలా ముఖ్యమైంది. పరీక్షలు కూడా అంతే. మహమ్మారి వంకతో పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు పంపిస్తారా? విద్యార్థుల భవిష్యత్తును చెడగొడతారా? అలా అయితే, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దేవుడే కాపాడాలి'' అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.