ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా: రాష్ట్రపతితో ఎన్నికల చీఫ్ కమిషనర్ భేటీ: దేనికి సంకేతం?: బెంగాల్లో
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా జమిలి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై స్పందిస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఉద్యమానికి కేంద్రంలో ఒకరకంగా కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ బీజం వేసింది. ఈ క్యాంపెయిన్ క్రమంగా ఊపందుకుంటోంది. ఒకే దేశం ఒకే ఎన్నికను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా సైతం రెండు రోజుల కిందటే ప్రకటన చేశారు. దీనితో జమిలి ఎన్నికలను నిర్వహణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయొచ్చనే లీకులు వెలువడుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యేల రివర్స్ టెండర్: వైఎస్ జగన్పై ప్రివిలేజ్ నోటీస్: పక్కదారి పట్టించేలా
రాష్ట్రపతితో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్..
ఇలాంటి వాతావరణం, జమిలి ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సునీల్ అరోరా.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఆయనకు ఓ నివేదికను అందజేశారు. సుమారు అరగంటకు పైగా వారిద్దరి మధ్య భేటీ కొనసాగింది. ఒకే దేశం ఒకే ఎన్నికను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ సునీల్ అరోరా ప్రకటించిన రెండోరోజే.. ఆయన రాష్ట్రపతిని కలుసుకోవడం, నివేదికను అందజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా అడుగు పడినట్టేనా?
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉందంటూ ఇదివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆ వెంటనే దానికి సునీల్ అరోరా.. తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడితే.. దానికి తాము సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనితో హస్తినలో రాజకీయ పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటూ వస్తున్నాయని, సునీల్ అరోరా ఉన్నట్టుండి రాష్ట్రపతిని కలుసుకోవడాన్ని దానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా ఓ అడుగు ముందుకు పడినట్టేననే అభిప్రాయాలు లేకపోలేదు.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై..
నాలుగు రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి. అస్సాం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించున్నారు. వాటికి సంబంధించిన వివరాలను సునీల్ అరోరా.. రాష్ట్రపతి అందజేశారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ అయిదు చోట్ల సజావుగా ఎన్నికలను నిర్వహించడానికి ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను సునీల్ అరోరా.. రాష్ట్రపతికి వివరించినట్లు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల వారీగా రూపొందించిన నివేదికను రాష్ట్రపతికి అందజేశారని అంటున్నారు.
పశ్చిమ బెంగాల్పై..
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఉందా? లేదా? అనే విషయాన్ని రాష్ట్రపతి ఆరా తీశారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలపై రాళ్లదాడి చోటు చేసుకున్న ఉదంతం అనంతరం పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న పరిణామాల అంశం కూడా వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉందంటూ కొద్దిరోజులుగా ఊహాగానాలు చెలరేగుతోన్న నేపథ్యంలో.. ఈ ప్రస్తావన వారిమధ్య వచ్చినట్లు తెలుస్తోంది.