ఒమిక్రాన్ పై కేంద్రం లేటెస్ట్ డేటా: 17 రాష్ట్రాల్లో 358 కేసులు; కోలుకున్న 117 మంది
భారత దేశాన్ని ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు వణికిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న సమయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూలను విధిస్తూ ఒమిక్రాన్ కట్టడికి ఇప్పటికే రాష్ట్రాలు రంగంలోకి దిగాయి. ఇదిలా ఉంటే భారతదేశంలోని 17 రాష్ట్రాల్లో 358 కరోనావైరస్ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శుక్రవారం తెలిపారు. వీరిలో 117 మంది ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు. ఇంకా బాధితులు 241 మంది ఉన్నట్టు సమాచారం.
చరిత్రలోనే అన్ని వైరస్ల కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి; కరోనా దారుణ స్థితికి: బిల్ గేట్స్ ఆందోళన
ఒమిక్రాన్ కు పాజిటివ్ పరీక్షించిన 121 మందికి విదేశీ ప్రయాణ చరిత్ర
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు పాజిటివ్ పరీక్షించిన 121 మందికి విదేశీ ప్రయాణ చరిత్ర ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో 44 మందికి విదేశీ ప్రయాణ చరిత్ర లేదు. ఒమిక్రాన్ వేరియంట్కు పాజిటివ్ పరీక్షించిన 18 మందిపై ప్రస్తుతం సమాచారం అందుబాటులో లేదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఓమిక్రాన్ వేరియంట్ యొక్క మొత్తం కేసులలో, 87 మంది రోగులు వైరస్కు వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు తీసుకున్న వారని, అయినా వారికి ఒమిక్రాన్ సోకిందని, ఇద్దరు రోగులు పాక్షికంగా టీకాలు వేయబడిన వారని, మొత్తం ఒమిక్రాన్ బాధితులలో ఏడుగురు రోగులకు వ్యాక్సిన్స్ ఇవ్వబడలేదని వెల్లడించారు.
మొత్తం కేసులలో 91 శాతం మంది పూర్తిగా టీకాలు తీసుకున్నవారు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ చూపిన డేటా ప్రకారం, మొత్తం ఒమిక్రాన్ కేసులలో, 183 భారతదేశానికి చెందిన వారు. వీరిలో 73 శాతం మంది విదేశీ ప్రయాణ చరిత్రను కలిగి ఉన్నారు. మొత్తం 70 శాతం మంది రోగులు లక్షణరహితంగా ఉన్నారు . మనదేశానికి చెందిన వీరిలో మొత్తం కేసులలో 91 శాతం మంది పూర్తిగా టీకాలు తీసుకున్నారు. కోవిడ్-19 కేసుల పెరుగుదల మరియు ఒమిక్రాన్ వేరియంట్పై ఆందోళనల దృష్ట్యా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని రాజేష్ భూషణ్ ప్రజలను కోరారు.
ఒమిక్రాన్ పై అలెర్ట్ చేసిన డబ్ల్యూహెచ్ఓ
డిసెంబరు 7న డబ్ల్యూహెచ్ఓ డెల్టా కంటే ఒమిక్రాన్ గణనీయమైన వ్యాప్తి కలిగి ఉందని, అంటే ఇది ఎక్కువ ట్రాన్స్మిసిబిలిటీని కలిగి ఉందని పేర్కొంది. ఒమిక్రాన్ కేసులు ఒకటిన్నర నుండి మూడు రోజుల్లో రెట్టింపు అవుతాయని పేర్కొంది.కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని "కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అప్రమత్తంగా లేకుంటే దారుణ పరిస్థితి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
భారత్ లో ఒమిక్రాన్ భయంతో కఠిన ఆంక్షల దిశగా రాష్ట్రాలు
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల నేపధ్యంలో అలాగే రానున్న నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించి కట్టడి యత్నాలు చేస్తున్నాయి. ఇక ఢిల్లీలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై బ్యాన్ విధించారు. అలాగే కర్ణాటక రాష్ట్రం బహిరంగ ప్రదేశాలలో సామూహిక వేడుకలను ఇప్పటికే నిషేధించింది. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు వ్యాక్సినేషన్ పై ప్రధానంగా దృష్టి సారించాయి. వ్యాక్సినేషన్ తీసుకోకుంటే జీతాలు ఇవ్వబోమని ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ స్పష్టం చేసింది. ఇక హర్యానా జనవరి 1వ తేదీ నుండి పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకోని వారిని బహిరంగ ప్రదేశాలలో అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది . యూపీలోనూ ఒమిక్రాన్ దృష్ట్యా డిసెంబర్ 31వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేస్తుంది.