మరోసారి కరోనా కల్లోలం - తాత్కాలిక ఆస్పత్రులు సిద్దం చేయండి : రాష్ట్రాలకు కేంద్రం లేఖ..!!
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. కరోనా కల్లోలం మర్చిపోకముందే తిరిగి ఒక్కసారిగా పెరుగుతున్న కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. తాత్కాలిక ఆసుపత్రులు సహా... కేసుల గుర్తింపు, హోం ఐసోలేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
ఆస్పత్రులు..కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయండి
కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న వారి ఐసోలేషన్ కోసం హోటల్ గదులను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలు, వార్డుల వారీగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.కరోనా పరీక్షలు, అంబులెన్సులు, ఆసుపత్రుల్లో పడకల ఏర్పాటుకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని రాజేశ్ భూషణ్ సూచించారు. అవసరమైన వారు ఫోన్ చేయగానే అంబులెన్సులు, ఆసుపత్రి పడకలు సిద్ధం చేసేలా ఈ యంత్రాంగం ఉండాలని స్పష్టం చేశారు. దీని అందుబాటు గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
సడన్ గా పెరిగిన కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా డిసెంబర్ 31న 16,764 కేసులు నమోదయ్యాయి. ఇది గత 70 రోజుల్లో ఒకే రోజులో నమోదైన అత్యధిక కేసులుగా అధికారులు చెబుతున్నారు. ఐసోలేషన్ పడకలు, ఫీల్డ్ ఆసుపత్రులు, ఐసీయూ పడకలు, పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆక్సిజన్ లభ్యత, అంబులెన్స్లు, మందులు, మానవ వనరులు, టెలి-కన్సల్టేషన్ల కోసం కూడా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇదే లేఖలో ఒమిక్రాన్ గురించి కేంద్రం ప్రస్తావించింది. ఒమిక్రాన్ కారణంగా, గత కొన్ని వారాల్లో యూరప్, అమెరికాలో ఇన్ఫెక్షన్ కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు.
70 రోజుల సమయంలో అత్యధికంగా
భారతదేశంలో కూడా, డిసెంబర్ 31 న, గత 70 రోజుల్లో అత్యధికంగా కరోనా సంఖ్య నమోదైంది. అందువల్ల ఆసుపత్రులు, వైద్యసేవలు, మందులు వంటి వాటిని మరమ్మతులు చేయాలని కోరారు. మండల స్థాయి నుంచి మానిటరింగ్ వ్యవస్థను డెవలప్ చేసుకోవాలని సూచించారు.
పెరుగుతున్న కరోనా కేసులు..ఇదే సమయంలో రోజు రోజుకీ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో కేంద్రం..నిత్యం పరిస్థితిని సమక్షిస్తోంది. అనూహ్యంగా కేరళలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్రలో 9,170 కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఆ రెండు రాష్ట్రాల్లోనూ భారీగా నమోదు
బంగాల్లో 4,512, దిల్లీలో 2,716.. కేరళలో 2,435 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 9,170 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. ఒక్క ముంబయి నగరంలోనే ఏకంగా 6,347 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 5,712 మందికి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. 451 మంది కోలుకున్నారని చెప్పారు. దీంతో..తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించాయి.