రైతులకు కేంద్రం ఊరట- ఎరువుల ధరలు పెంచొద్దని ఆదేశాలు
దేశవ్యాప్తంగా ఎరువుల ధరల పెంపుకు కంపెనీలు సిద్దమవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో ఎరువుల ధరలు పెంచొద్దని వారికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ ఓ ప్రకటన విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే ఎరువుల ధరలను పెంచనున్నట్లు కంపెనీలు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కంపెనీల ప్రకటనతో ఆందోళనకు గురవుతున్న అన్నదాతలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమ్మతున్న ధరలకే ఎరువులు అమ్మాలని ఆయా సంస్దలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కంపెనీలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాల్సి వస్తోంది. ఇవాళ జరిగిన ఉన్నతస్దాయి సమీక్ష అనంతరం కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్ ధరల్లాగే అంతర్జాతీయంగా రోజూ పెరిగే ఎరువుల ధరల్ని పెంచాలని తాజాగా కంపెనీలు నిర్ణయించాయి. అయితే ఎరువులకు మాత్రం కేంద్రం రాయితీని భరించి సాధారణ ధరలకే అందిస్తుంటుంది. రాయితీ మొత్తాన్ని కంపెనీలకు చెల్లిస్తుంది. కానీ వీటి మధ్య అంతరం నానాటికీ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎరువుల కంపెనీలు చేసిన ప్రకటనతో కేంద్రం ఇరుకునపడింది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా జరుగుతున్న తరుణంలో ఎరువుల ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడం ఖాయమని బావించిన కేంద్రం.. ధరల్ని పెంచకుండా కంపెనీల్ని కట్టడి చేసింది.
Recommended Video