ధర్డ్ వేవ్ భయాలు-46 జిల్లాలకు కేంద్రం హెచ్చరికలు-10 శాతం మించి పాజిటివిటీ రేటు
దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గకముందే ధర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంకా కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గకపోవడంతో ప్రభుత్వాలతో పాటు డాక్టర్లు కూడా తలపట్టుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం 10 శాతానికి మించి పాజిటివిటీ రేటు కలిగిన 46 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశా, అస్సోం, మిజోరం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ లోని 46 జిల్లాలకు కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం పది రాష్ట్రాల్లో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్రం ఇవాళ ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా 45 ఏళ్లకు పైబడిన వారందరికీ తక్షణం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్రాలకు జారీ చేసిన హెచ్చరికల్లో పేర్కొంది.
దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని, అలాగే మరో 53 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య ఉందని కేంద్రం తాజా ప్రకటనలో పేర్కొంది. ఆయా జిల్లాల్లో కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ జిల్లాల్లో 80 శాతం పైగా రోగులు హోం ఐసోలేషన్ లోనే ఉన్నారని, వీరు బయటికి వచ్చి వైరస్ వ్యాప్తి చేయకుండా చూడాలని కూడా కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయన్న వార్తలు ప్రభుత్వాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ధర్డ్ వేవ్ భయాలు పెంచుతున్నాయి.