యాప్ ల రద్దు తర్వాత చైనాకు మరో భారీ ఝలక్ ? దిమ్మతిరగడం ఖాయం- కేంద్రం సంకేతం..
గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న భారత్.. పొరుగుదేశం తరహాలోనే ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఎక్కడికక్కడ కత్తెర్లు వేస్తోంది. తాజాగా 59 చైనా యాప్ లపై నిషేధం విధించిన కేంద్రం ఆ తర్వాత మరికొన్ని కీలక దిగుమతులను అడ్డుకునే దిశగా వ్యూహరచన చేస్తోంది. అదే జరిగితే చైనా ఉత్పత్తి సంస్ధలు భారీగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే అత్యున్నత స్ధాయి వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్న కేంద్రం.. వచ్చే సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది.

చైనాకు ఇక చుక్కలే...
గతంలో చౌక ధరకే దేశంలోకి వచ్చిపడుతున్న చైనా ఉత్పత్తుల విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించిన కేంద్రం... గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత పూర్తిగా వ్యూహం మార్చుకుంది. ఇప్పటికే దేశాన్ని ముంచెత్తుతున్న కీలకమైన చైనా ఉత్పత్తులను ఒక్కొక్కటిగా నిషేధిస్తూ రావాలని భావిస్తున్న కేంద్రం... తొలి విడతగా 59 పాపులర్ మొబైల్ యాప్ లను నిషేధించింది. దీనిపై చైనా ఆగ్రహంతో ఊగిపోతున్న సమయంలోనే తమ తదుపరి చర్యపై కేంద్రం లీకులు ఇవ్వడం ప్రారంభించింది.

చైనీస్ 5జీ పరికరాలకు చెక్...
ప్రస్తుతం దేశంలో వాడుకలో ఉన్న 4జీ టెక్నాలజీ స్ధానంలో 5జీ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చైనాకు చెందిన 5జీ పరికరాల దిగుమతికి కేంద్రం ద్వారాలు తెరిచింది. కానీ తాజాగా సరిహద్దుల్లో కనికరం లేకుండా మన సైనికులను పొట్టనపెట్టుకుంటున్న చైనాపై కఠిన వైఖరి అవలంబించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా కేంద్రం ఇక 5జీ పరికరాల దిగుమతులకూ చెక్ పెట్టనుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా కేంద్రమంత్రులు, అధికారులతో ఓ కమిటీని కూడా నియమించింది. కమిటీ సూచనల ఆధారంగా వచ్చే సోమవారం కేంద్రం 5జీ పరికరాల దిగుమతిపై కీలక నిర్ణయం ప్రకటించబోతోంది.

హువాయ్ తో పాటు వాటికీ దెబ్బ..
వాస్తవానికి దేశంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం మార్చిలో జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం కారణంగా ఇది వాయిదా పడుతూ వస్తోంది. ఈ వేలం జరిగితే స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన ప్రైవేటు ఆపరేటర్లు చైనా నుంచి 5జీ పరికరాలు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. చైనాకు చెందిన హువాయ్ సంస్ధ వీటిని సరఫరా చేస్తోంది. అయితే ఇప్పటికే హువాయ్ సంస్ధ అధినేతకు చైనా కమ్యూనిస్టు పార్టీతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నిషేధం విధించారు. అంతేకాకుండా భారత్ తో పాటు పలు దేశాలు కూడా నిషేధం విధించాలని కోరుతున్నారు. ఇప్పుడు భారత్ చైనా 5జీ పరికరాలపై నిషేధం విధిస్తే దాని ప్రభావం హువాయ్ తో పాటు పలు ఎలక్ట్రానికి సంస్దలపై తీవ్రంగా పడనుంది.

మన ప్రైవేటు ఆపరేటర్లపైనా...
5జీ స్పెక్ట్రమ్ వేలం తర్వాత చైనా నుంచి 5జీ పరికరాల దిగుమతి కోసం ఎదురుచూస్తున్న దేశీయ మొబైల్ ఆపరేటర్లకు కూడా కేంద్రం నిర్ణయం శరాఘాతం కానుంది. ఇప్పటివరకూ చైనా నుంచి కారు చౌకగా ఎలక్ట్రానిక్ పరికరాలు దిగుమతి చేసుకుని టెలి కమ్యూనికేషన్ రంగంలో పెను మార్పులు చేపట్టిన ఆపరేటర్లు.. కేంద్రం చైనాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అంతే కాదు త్వరలో 4 జీ నుంచి 5జీ టెక్నాలజీకి మారేందుకు సిద్ధమవుతున్న భారతీయ వినియోగదారులకూ నిరాశ తప్పకపోవచ్చు. అందుకే కేంద్రం దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అయితే నిషేధం మాత్రం ఖాయమే అన్నట్లుగా సంకేతాలు ఇస్తోంది.












Click it and Unblock the Notifications