నమ్మక ద్రోహాన్ని సహించం.. ఆయనకు శిక్ష పడాల్సిందే: అమిత్ షా
రాజకీయాల్లో దేన్నైనా సహించగలంగానీ నమ్మకద్రోహాన్ని సహించలేమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. భారతీయ జనతాపార్టీకి ఉద్ధవ్ ఠాక్రే చేసింది ముమ్మాటికీ ద్రోహమేనని, అందుకే ప్రభుత్వం అలా కుప్పకూలిపోయిందన్నారు. ఆయనకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో మోసం చేసినవారికి శిక్ష పడాల్సిందేనని షా స్పష్టం చేశారు. ముంబయిలోని పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
శివసేన పార్టీ చీలిపోవడానికి, అనంతరం జరిగిన పరిణామాలకు ఉద్ధవ్ ఠాక్రేనే కారణమని, అతనికున్న అధికార దాహమే వెన్నుపోటుకు దారితీసిందని అభిప్రాయపడ్డారు. బీజేపీని మోసం చేయడమే కాకుండా నమ్మిన సిద్ధాంతాలను కూడా మరిచిపోయారన్నారు. ఉద్ధవ్ను ముఖ్యమంత్రిని చేస్తామని తామెన్నడూ చెప్పలేదని, తలుపులు మూసుకొని గదుల్లో రాజకీయాలు నడపడం తమకు తెలియదని, బీజేపీకి తెలిసింది ఓపెన్ పాలిటిక్స్ అని షా అన్నారు.
శివసేనలో ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కఠిన పరీక్షగా ముంబయి స్థానిక సంస్థల ఎన్నికలు నిలవబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ మిషన్-150 ని తెరపైకి తెచ్చింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన నగరపాలక సంస్థగా ముంబయి ఉంది. ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది.