లాలూజీ.. మీ ఇంట్లోకి మళ్లీ పాము వచ్చింది!!
అనేక నాటకీయ పరిణామాల అనంతరం బిహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. భారతీయ జనతాపార్టీతో బంధాన్ని తెచ్చుకున్న జేడీయూ నేత నితీష్ కుమార్ ఆర్జేడీతో జట్టుకట్టారు. తెగిపోయిన పాత బంధాన్ని పునరుద్ధరించుకున్నారు. నితీష్ కుమార్ వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 5 సంవత్సరాల క్రితం లాలూప్రసాద్ యాదవ్ చేసిన ట్వీట్ ను మరోసారి గుర్తుచేస్తూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. ''మీ ఇంట్లోకి పాము చొరబడింది'' అంటూ రాశారు.
ఆర్జేడీతో 2017లో జేడీయూ తెగదెంపులు చేసుకొని బీజేపీతో చేతులు కలిపింది. ఆ సమయంలో లాలూప్రసాద్ ఓ ట్వీట్ చేశారు. ''నితీష్ కుమార్ ఓ పాము లాంటి వ్యక్తి.. పాము ఎలాగైతే కుబుసం విడుస్తుందో నితీష్ కుమార్ కు ప్రతి రెండు సంవత్సరాలకోసారి కొత్త చర్మం వస్తుంది. ఇందులో ఏమైనా సందేహాలున్నాయా?'' అని జేడీయూ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ ట్వీట్ ను ప్రస్తావిస్తూ ఆ పాము ఇప్పుడు మీ ఇంట్లోకి మళ్లీ చొరబడింది అంటూ కేంద్ర మంత్రి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
2015 బిహార్ ఎన్నికల సమయంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహా కూటమిగా ఏర్పడి విజయం సాధించాయి. నితీష్ ముఖ్యమంత్రి అవగా తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. రెండు సంవత్సరాలకే వీరి బంధానికి ముగింపు పలికారు నితీష్. బీజేపీతో పొత్తుపెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.