రాష్ట్రాలకు కేంద్ర బృందాలు: కరోనా కట్టడికి మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా లాక్డౌన్ ఆంక్షలు నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికి చర్యలకు కేంద్రం సన్నద్ధమైంది. దేశ వ్యాప్తంగా అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయం తీసుకుంది.
కరోనా కల్లోలం: బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మృతి, 50 లక్షల ఎక్స్గ్రేషియా
15 రాష్ట్రాలకు ఈ బృందాలను పంపుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15 రాష్ట్రాల్లోని 50కిపైగా జిల్లాలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక బృందాలు పంపుతున్నట్లు తెలిపింది.
అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రకు 7, తమిళనాడు 7, తెలంగాణకు 4, రాజస్థాన్ 6, అస్సాం 6, హర్యానా 4, గుజరాత్ 3, కర్ణాటక 4, ఉత్తరాఖండ్ 3, మధ్యప్రదేశ్ 5, పశ్చిమబెంగాల్ 3, ఢిల్లీ 3, బీహార్ 4, ఉత్తరప్రదేశ్ 4, ఒడిశా 5 జిల్లాలు, మున్సిపాలిటీలకు కేంద్ర బృందాలు వెళ్లనున్నాయి.
ముగ్గురు సభ్యులతో కూడిన ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందంలో ప్రజారోగ్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు, వైద్యులు, సీనియర్ జాయింట్ సెక్రటరీ స్థాయి నోడల్ అధికారులు ఉంటారని కేంద్రం వెల్లడించింది. ఈ బృందాలు నగరాల్లోని కేసుల నియంత్రణ చర్యలు, సమర్థవంతమైన చికిత్స నిర్వహణలో రాష్ట్ర ఆరోగ్యశాఖకు మద్దతుగా ఉంటాయి. అవసరమైన చర్యలు తీసుకుంటాయి.
కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే అత్యధికంగా నమోదైన విషయం తెలిసిందే. మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 88,529 కరోనా పాజిటివ్ కేసులుండగా, 44,385 యాక్టివ్ కేసులున్నాయి. 40,975 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3169 మంది కరోనాతో మరణించారు.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలించినట్లయితే.. ఇప్పటి వరకు దేశంలో 2,70,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,31,927 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 1,31,380 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 7554 మంది ప్రాణాలు కోల్పోయారు.