Amritpal Singh : అమృత్ పాల్ కోసం భారీ వేట-సరిహద్దుల్ని అలర్ట్ చేసిన కేంద్రం
పంజాబ్ : ప్రత్యేక ఖలిస్తాన్ నినాదంతో పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్న వారిసే పంజాబ్ దే సంస్ధ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం భారీవేట కొనసాగుతోంది.ఇప్పటికే రెండు రోజుల క్రితం ఆయన పంజాబ్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. దీంతో అమృత్ పాల్ ను బంధించేందుకు కేంద్రం ఇవాళ సరిహద్దుల్లో బలగాల్ని అప్రమత్తం చేసింది.
అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు ఇప్పటికే పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆయుధాల కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు కేంద్రం కూడా రంగంలో దిగింది. ఖలిస్తాన్ పేరుతో యువతను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత్ పాల్ సింగ్.. తాజాగా కిడ్నాప్ ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసిన ఆయన అనుచరుడు లవ్లీ సింగ్ ను పోలీసు స్టేషన్ పై దాడి చేసి సినీ ఫక్కీలో విడిపించుకోవడం సంచలనం రేపింది. దీంతో పంజాబ్, కేంద్రం కలిసి ఆయన్ను పట్టుకునేందుకు అడుగడుగూ జల్లెడపడుతున్నాయి.

ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ సరిహద్దు భద్రతా దళాలైన బీఎస్ఎఫ్ తో పాటు సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)లను కూడా అప్రమత్తం చేసింది. అమృత్ పాల్ సింగ్ వివరాలు వారికి పంపడంతో పాటు ఎలాంటి అనుమానం వచ్చినా కేంద్ర హోంశాఖకు సమాచారం ఇవ్వాలని కోరింది. దీంతో పాటు పంజాబ్ పోలీసులు రాష్ట్రంతో పాటు హర్యానాలోనూ జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ సింగ్ దొరుకుతాడా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పంజాబ్ పోలీసుల ఆపరేషన్ మూడోరోజుకు చేరుకున్నా అమృత్ పాల్ ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు.












Click it and Unblock the Notifications