Covid Vaccineపై కేంద్రం కీలక సవరణ -ఇక నేరుగా టీకా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ -18-44వయసు వారికి..
దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక సవరణ చేసింది. ఇన్నాళ్లూ కొవిన్ యాప్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారికి మాత్రమే ఆయా కేంద్రాల్లో టీకాలు అందిస్తూండగా, ఇప్పుడా విధానాన్ని మరింత సరళతరం చేశారు. 18 నుంచి 44ఏళ్ల మధ్య వయసు గల వారు ఇకపై ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండానే నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్లు పొందే వీలును కల్పించింది. అయితే..
కరోనాలో మోదీ ఎన్నికల వ్యూహాలు -యూపీ అసెంబ్లీపై బీజేపీ-ఆర్ఎస్ఎస్ మథనం -గంగలో భారీగా మృతదేహాలు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీకా సెంటర్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త నిబంధనల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్సైట్ లేదా వాక్-ఇన్ (అప్పటికప్పుడు) రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా వేయించుకునే వీలు ఏర్పడింది. టీకాల వృథాను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.
''టీకాల కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న లబ్ధిదారులు ఒకవేళ ఆ రోజున రాకపోతే ఆ టీకా డోసులు నిరుపయోగంగా మారుతున్నాయి. అందుకే టీకా వృథాను కొంతలో కొంత తగ్గించేందుకు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద 18-44 ఏళ్ల వారికి ఆన్సైట్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తున్నాం'' అని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక, ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి, మొబైల్ ఫోన్స్ వాడకం తెలియనివారికి కూడా ఆన్సైట్ నమోదుకు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. అయితే..
జులై 23న దేవుడు ఏం రాసిపెట్టాడో? -జగన్, చంద్రబాబు ఆఖరిపోరు: సాయిరెడ్డి బాంబు -రఘురామ, డా.సుధాకర్
ఆన్ సైట్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ల విషయంలో తుది నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ 18-44 ఏళ్ల వారికి ఆయా రాష్ట్రాలు ఆన్సైట్ రిజిస్ట్రేషన్కు అనుమతినిస్తే.. అది కేవలం ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ప్రయివేటు కేంద్రాల వద్ద వాక్-ఇన్ నమోదులను చేపట్టొద్దని సూచించింది. అంతేగాక, ఆన్సైట్ రిజిస్ట్రేషన్ సమయంలో టీకా కేంద్రాల వద్ద ఎలాంటి రద్దీ లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.
కేంద్రం తలపెట్టిన మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మే 1 నుంచి 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు. అయితే డోసుల కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో డ్రైవ్ ముందుకు సాగడంలేదు. రాష్ట్రాలు సొంతగా గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్ల సేకరణకు సిద్ధమైనా, కేంద్రం ప్రతిబంధకాలు సృష్టిస్తుండటం వివాదాస్పదమైంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిపై గందరగోళం నెలకొన్నవేళ ఆన్ సైట్ రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.