బాబుకు ఊరట: ఎపికి కేంద్రం రూ.850 కోట్ల ప్యాకేజీ, టీకి కొద్దిగా..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించింది. కేంద్ర సాయం అందితే తప్ప ముందుకు సాగలేమనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేంద్రం ముందుకు వచ్చింది. ప్రత్యేక హోదా, తొలి ఏడాది రెవెన్యూలోటు భర్తీ వంటి సంగతులు పక్కనపెట్టి, ప్రస్తుతానికి వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.350 కోట్లు సహాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.500 కోట్లు ఆర్థిక మద్దతు ఇచ్చింది. ఇదే సమయంలో తెలంగాణకు పరిమితంగా పారిశ్రామిక రాయితీలు ఇచ్చింది.
కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం రాత్రి దీనిపై ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 46(2), 46(3) సెక్షన్ల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ ఏపీలోని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు, రాయలసీమలోని నాలుగు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేసింది. 2014-15 సంవత్సరానికి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు మంజూరు చేస్తున్నామని ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, అందించాల్సిన సహాయాన్ని సమీక్షించేందుకుగాను కేంద్ర హోం శాఖ ఇప్పటికే అంతర్ మంత్రిత్వ శాఖల సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ సిఫారసులు అంది, వాటిని అమలుకు పూనుకునేలోగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడబోయే వనరుల లోటును భర్తీ చేసేందుకు తాత్కాలిక మద్దతుగా రూ.500 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.
2014-15 సంవత్సరానికే ఈ మద్దతు లభిస్తుంది. వాస్తవానికి విభజన చట్టంలోని సెక్షన్ 94(1)లో పేర్కొన్న విధంగా... ఏపీ, తెలంగాణలో పారిశ్రామికీకరణను, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర పన్ను రాయితీలు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రస్తుతానికి మూడు నిర్ణయాలు తీసుకుంది. ఐదేళ్లపాటు రాయితీలు వర్తిస్తాయని తెలిపింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాల్లో మొదటి ఏడాది పెట్టే కొత్త ప్లాంటు, మిషన్లకు 15 శాతం అదనపు తగ్గింపు అలవెన్సు లభిస్తుంది.
దీంతోపాటు ప్లాంట్లు, మిషినరీలపై 15 శాతం అదనపు పెట్టుబడి అలవెన్సు కూడా ఇస్తారు. ఐదేళ్ల కాలంలో చివరి సంవత్సరం పరిశ్రమ పెట్టినా ఈ రాయితీ వర్తిస్తుంది. ఇక.. రూ.25 కోట్లకు మించిన పెట్టుబడులు పెడితే, పరిశ్రమలు అడగకుండానే తగ్గింపు, పెట్టుబడి అలవెన్సులు వర్తిస్తాయి. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ(డీఐపీపీ) ప్రతిపాదనలతోపాటు ఇంకా చాలా ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications