అంతకంటే మించవద్దు.. మాస్కులు,శానిటైజర్స్ ధరలపై కేంద్ర కీలక ఆదేశాలు
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అవసరమైన శానిటైజర్స్,ఫేస్ మాస్క్లను తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రేషన్ ద్వారా శానిటైజర్స్,మాస్కులను సప్లై చేయాలని విజ్ఞప్తి చేసింది.వినియోగదారుల వ్యవహారాల శాఖ సెక్రటరీ పవన్ అగర్వాల్ దీనిపై మాట్లాడుతూ.. ఆయా ఇండస్ట్రీలకు చెందిన ప్రతినిధులు తక్కువ ధరలకే శానిటైజర్స్,మాస్కులు వంటి హైజీన్ ఉత్పత్తులను సప్లై చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు రేషన్ షాపుల ద్వారా హైజీన్ ఉత్పత్తులను సప్లై చేస్తున్నాయని.. త్వరలోనే మరికొన్ని రాష్ట్రాలు కూడా దాన్ని చేపట్టవచ్చునని తెలిపారు.
ఇప్పటికే మొదలుపెట్టిన ఢిల్లీ ప్రభుత్వం
ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఫేస్ మాస్కులు,చేతి తొడుగులు,సబ్బులు,హ్యాండ్ శానిటైజర్స్ను పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనూ దీన్ని అమలుచేయాలని పవన్ అగర్వాల్.. అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు నగరాల్లో ఆంక్షలు అమలులో ఉండటంతో.. ఈకామర్స్ ప్లాట్ఫామ్స్తో ఒప్పందం కుదుర్చుకుని హైజీన్ ఉత్పత్తులను కొరియర్ ద్వారా అందించే ఏర్పాట్లు చేయాలన్నారు.
హైజీన్ ఉత్పత్తుల కొరత లేకుండా చూసుకోవాలని..
శానిటైజర్స్లో ఉపయోగించే ప్రధాన ద్రావకం ఇథైల్ అల్కాహాల్ను డియోడరెంట్ మాన్యుఫాక్చరర్స్కు రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే రిటైల్ సేల్స్కు తాత్కాలికంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు హైజీన్ ఉత్పత్తుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రాలు ఆరు నెలల వరకు ఆహార ధాన్యాల సప్లైని నిలిపివేసి.. వాటిని రిటైలర్స్కు పంపించడం ద్వారా వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
అంతకంటే మించవద్దు
వినియోగదారుల వ్యవహారాల శాఖ,నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ హైజీన్ ఉత్పత్తుల పెంపు కోసం మాన్యుఫాక్చర్ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేశాయి. సెంట్రల్ డ్రంగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO),లీగల్ మెట్రోలాజీ డైరెక్టర్ మార్కెట్లో శానిటైజర్స్,మాస్కుల అందుబాటును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అలాగే ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించరాదని గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం సాధారణ మాస్కును రూ.8 కంటే ఎక్కువకు అమ్మరాదు. అలాగే 200 మిల్లీ లీటర్ల శానిటైజర్ను రూ.100కి మించి విక్రయించరాదు.ఫిబ్రవరి 12 నాటికి ఉన్న ధరలనే కొనసాగించాలని శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.