Aravalli Mining: ఆరావళి పర్వతాలపై కేంద్రం వెనక్కి..! రాష్ట్రాలకు కీలక ఆదేశం..!
నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన భారత దేశ పురాతన పర్వత శ్రేణులైన ఆరావళిలో (Aravalli Mining) ఖనిజాల తవ్వకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇవాళ వెనక్కి తగ్గింది. ఆరావళి పర్వతశ్రేణుల్లో మైనింగ్ చేపట్టే విషయంలో నాలుగు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి ఈ మైనింగ్ హాని కలిగిస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గుజరాత్ నుంచి ఢిల్లీ వరకూ విస్తరించి ఉన్న ఆరావళీ పర్వతాల్లో మైనింగ్ కు ఆయా రాష్ట్రాలు కేంద్రం సాయంతో మైనింగ్ లీజుల్ని కేటాయిస్తుండటం, వాటికి కోర్టుల్లోనూ ఇబ్బందులు లేకపోవడంతో జనం నుంచి విమర్శలు మొదలయ్యాయి. భారత దేశానికి కీలకమైన ఈ పర్వత శ్రేణుల్ని కాపాడేందుకు కేంద్రం ముందుకు రాకపోగా.. వాటిలో మైనింగ్ కు అనుమతులు ఇవ్వడమేంటన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో కేంద్రంతో పాటు నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇరుకునపడ్డాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ ఆరావళీ పర్వతాల్లో రాష్ట్రాలు ఎలాంటి కొత్త మైనింగ్ లీజులు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆరావళి శ్రేణిని రక్షించే దిశగా ఒక ప్రధాన అడుగుగా దీన్ని అభివర్ణించింది. ఆరావళి పర్యావరణ వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక రక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ పర్వత శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయడంపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు తెలిపింది.

ఆరావళి శ్రేణి యొక్క సమగ్రతను కాపాడటానికి కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయడంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గుజరాత్ నుండి జాతీయ రాజధాని ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిరంతర భౌగోళిక శిఖరంగా ఆరావళిని రక్షించడం, అన్ని క్రమబద్ధీకరించని మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయడం ఈ ఆదేశాల లక్ష్యమని ఇందులో పేర్కొంది.












Click it and Unblock the Notifications