లాక్డౌన్ పొడిగింపు: రాష్ట్రాల ప్రతిపాదనలను ఆమోదించే దిశగా కేంద్రం యోచన.. లీకులు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను ముగియడానికి కౌంట్డౌన్ ఆరంభమైంది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మరో వారం రోజుల్లో లాక్డౌన్ ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. కరోనా వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి లాక్డౌన్ను కొనసాగించాల్సిందేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది.
Recommended Video

రాష్ట్రాల విజ్ఙప్తులు, ప్రతిపాదనల మేరకే..
ఈ చర్చకు కేంద్ర ప్రభుత్వం తెరదించేలా కనిపిస్తోంది. లాక్డౌన్ను పొడిగించే దిశగా అడుగులు వేస్తోంది. లాక్డౌన్ను మరి కొంతకాలం పాటు పొడిగించడం వల్ల ఉపయోగం ఉంటుందని, కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఇంతకు మించి మరో మార్గం లేదంటూ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విలేకరుల సమావేశంలో బహిరంగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఙప్తి చేశారు.
పొడిగించడం వైపే మొగ్గు..
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. లాక్డౌన్ను మరికొంత కాలం పాటు పొడిగించడం వైపే మొగ్గు చూపిందనే వార్తలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు మీడియాకు లీకులను ఇస్తున్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తాజాగా చేసిన వ్యాఖ్యానాలు ఈ అనుమానాలను మరింత బలాన్ని ఇస్తున్నాయి.లాక్డౌన్ పొడిగించాలా? వద్దా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోబోదని అన్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాలను తెలుసుకుంటోందని చెప్పారు. మెజారిటీ రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం గౌరవిస్తుందని అన్నారు.

సరైన సమయంలో వెల్లడిస్తాం..
లాక్డౌన్ను పొడిగించడమా? లేక ముగించేసేయడమా? అనే విషయంపై ఇప్పుడిప్పుడే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోదలచుకోలేదని ప్రకాశ్ జవదేకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ముగియడానికి ఇంకా సమయం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లాక్డౌన్ పొడిగించాలా? వద్దా? అనే విషయాన్ని సరైన సమయంలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. కేంద్రం లాక్డౌన్ను పొడిగించడం వైపే మొగ్గు చూపుతోందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టయింది.

ఇక వారం రోజులే..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ వచ్చేవారం ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో పొడిగింపుపై కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. ఫలితంగా- అటు రైల్వే మంత్రిత్వ శాఖ, ఇటు ప్రైవేటు విమానయాన సంస్థలు టికెట్ల రిజర్వేషన్ను చేపట్టాయి కూడా. ఏపీలో ప్రజా రవాణా శాఖ అధికారులు కూడా ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లను ఆరంభించారు కూడా. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టికెట్లు బుక్ అయ్యాయి. లాక్డౌన్ను పొడిగించాల్సి వస్తే సర్వీసులను రద్దు చేయడం ఖాయం.












Click it and Unblock the Notifications