కేంద్రంతో రైతుల చర్చలు : మళ్లీ కొలిక్కి రాకుండానే.. ఆ ఒక్కటే కాస్త ఉపశమనం.. ఇవీ హైలైట్స్
రైతులు-కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. సుమారు 7గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చలు ఏ అంశం కొలిక్కి రాకుండానే ముగిశాయి. అయితే కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించడం ఒక్కటే తాజా చర్చల్లో రైతులకు కాస్త ఉపశమనం కలిగించే అంశం. తదుపరి చర్చలు డిసెంబర్ 5న జరగుతాయని కేంద్రం ప్రకటించింది. చర్చలకు ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఛాన్స్ అని ప్రకటించిన రైతు సంఘాలు కేంద్రానికి మరో అవకాశం ఇచ్చాయి.
రైతులు ఏమంటున్నారు...
తాజా చర్చల్లో మూడు కొత్త వ్యవసాయ చట్టాల్లోని లోపాలన్నింటీనీ కేంద్రం ముందు పెట్టామని చర్చల అనంతరం రైతు నాయకుడు బల్ దేవ్ సింగ్ సిర్సా తెలిపారు. చట్టాల్లో లోపాలను కేంద్రం అంగీకరించిందని... వాటిని పున:సమీక్షిస్తామని చెప్పిందన్నారు. అయితే తాము ఆ చట్టాలకు సవరణలు కోరట్లేదని... పూర్తిగా వాటిని రద్దు చేయాలన్నదే తమ డిమాండ్ అని కేంద్రానికి మరోసారి స్పష్టం చేశామన్నారు. కనీస మద్దతు ధరకు హామీతో సరిపుచ్చకుండా దానికోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశామన్నారు.
శనివారం తేలిపోతుందా?
'తదుపరి చర్చల్లోనైనా మా డిమాండ్లకు కేంద్రం ఒప్పుకుంటుందని ఆశిస్తున్నాం. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు సరైనవి కావు. తదుపరి చర్చల్లో కేంద్రంపై మరింత ఒత్తిడి తెస్తాం. ఆ చట్టాలను ఉపసంహరించుకుంటామని కేంద్రం ప్రకటన చేయాల్సిందే. శనివారం ఏదో ఒకటి తేలిపోతుంది.' అని ఆజాద్ కిసాన్ సంఘర్ష్ కమిటీకి చెందిన హర్జీందర్ సింగ్ తెలిపారు.
చర్చలపై కేంద్రమంత్రులు...
చర్చల అనంతరం కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. 'రైతులకు మరిన్ని చట్టబద్దమైన హక్కులను కల్పించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. కనీస మద్దతు ధర కొనసాగుతుంది... దానిపై రైతులకు మేము హామీ ఇచ్చాం. ఇకనైనా ఆందోళనలకు ముగింపు పలికితే రైతులకే మంచిది.' అని పేర్కొన్నారు. అలాగే రైతు సమస్యలను చెప్పుకోవడానికి సబ్ డివిజన్ మెజిస్ట్రేట్కు బదులు కోర్టుకు వెళ్లే అవకాశాన్ని కల్పించాలని రైతులు కోరుతున్నారని... దాన్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు.మరో కేంద్రమంత్రి సోమ్ ప్రకాష్ మాట్లాడుతూ.. డిసెంబర్ 5న ప్రధానంగా మూడు అంశాలపై చర్చించబోతున్నామని తెలిపారు. అదే రోజు రైతుల ఆందోళనకు తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా తాజా చర్చల్లో పాల్గొన్నారు.
కొనసాగనున్న ఆందోళనలు...
చర్చలు డిసెంబర్ 5కి వాయిదా పడటంతో రైతులంతా యథావిధిగా ఆందోళనలు కొనసాగించనున్నారు. శుక్రవారం ఉదయం 11.30గంటలకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ జాయింట్ ప్లాట్ఫాం నేతలు సింఘు సరిహద్దు వద్ద సమావేశమై రైతులకు మద్దతు ప్రకటించనున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా అటు ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాల్లో సమాజ్వాదీపార్టీ కిసాన్ యాత్రలు చేపట్టనుంది. రైతులకు మద్దతుగా తమిళనాడులో డీఎంకె పార్టీ కూడా ర్యాలీలకు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా శిరోమణి అకాలీదళ్ నేత,మాజీ పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ తన పద్మ విభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. పంజాబ్ క్రీడాకారులైన పద్మశ్రీ,అర్జున అవార్డు గ్రహీత రెజ్లర్ కర్తార్ సింగ్,అర్జున అవార్డు గ్రహీత,బాస్కెట్ బాల్ ప్లేయర్ సజ్జన్ సింగ్,మరో అర్జున అవార్డు గ్రహీత,హాకీ ప్లేయర్ రాజ్బీర్ కౌర్ కూడా తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు.