జమిలి ఎన్నికలపై కేంద్రం మరో అడుగు-మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ..
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ నెలలో ఐదురోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన కేంద్రం.. అందులో జమిలి ఎన్నికల బిల్లు పెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో జమిలి ఎన్నికలపై సూచనలు,సలహాలు ఇచ్చేందుకు వీలుగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ లో జమిలి ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు వీలుగా మాజీరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ఇవాళ వెల్లడించింది. సెప్టెంబర్ 18 నుండి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ కమిటీ ఏర్పాటు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు పెట్టే అవకాశాలున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నా కేంద్రం మాత్రం మౌనంగా ఉంది.

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రంతో పాటు ప్రధాని మోడీ కూడా పలుమార్లు సానుకూలంగా స్పందించారు. అలాగే 2014లోనే బీజేపీ జమిలి ఎన్నికల్ని తమ మ్యానిఫెస్టోలో పెట్టింది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక లా కమిషన్ కు జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసే బాధ్యత అప్పగించింది. దీంతో లా కమిషన్ తన అధ్యయనం కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక త్వరలో కేంద్రానికి అందబోతోంది. అదే సమయంలో రామ్ నాథ్ కోవింద్ కమిటీ అధ్యయన నివేదిక కూడా తెప్పించుకుని పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశాలున్నాయి.

1967 వరకు దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ఆనవాయితీగా ఉండేది. అలాగే నాలుగు ఎన్నికలు ఇదే పద్ధతిలో జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేశాక ఈ విధాన రద్దయినట్లయింది. లోక్సభ కూడా మొదటిసారిగా, షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేసారు. అలాగే 1971లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన 2014 లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో తిరిగి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.
దీని వల్ల భారీగా ఖర్చు ఆదాతో పాటు అభివృద్ధిపై సానుకూల ప్రభావం పడుతుందని చెబుతోంది.












Click it and Unblock the Notifications