ఆధార్ ఉల్లంఘనలపై కేంద్రం కొరడా-ఉడాయ్ కు అధికారాలు-కోటి వరకూ ఫైన్
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆధార్ ఉల్లంఘనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ సంఖ్య కేటాయింపు, నిర్వహణ, సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఆధార్ ప్రాధికార సంస్ధ ఉడాయ్ కు ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాలు కల్పిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉడాయ్ ఏర్పాటును నోటిఫై చేసిన రెండేళ్ల తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఆధార్ ఉల్లంఘనలపై చర్యలు తీసుుకునేందుకు వీలుగా ఉడాయ్ తమ పరిధిలో న్యాయాధికారుల్ని నియమించుకోవడం, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వీలుగా అధికారాలు కల్పిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు ఉడాయ్ న్యాయనిర్ణేతలను నియమించుకోనుంది. వీరు ఫిర్యాదుల్ని పరీశీలించి గరిష్టంగా కోటి రూపాయల వరకూ జరిమానా విధించేందుకు వీలు కల్పించారు. అలాగే జైలు శిక్షలు కూడా ఉంటాయి. ఇలా న్యాయనిర్ణేతలు విధించిన జరిమానాలు, శిక్షలపై అప్పీలు కోసం టెలికాం వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ ను అప్పిలేట్ అధారిటీగా నిర్ణయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా కేంద్రం చేపట్టిన మార్పుల ప్రకారం ఆధార్ చట్టంలో ఉల్లంఘనలకు పలు జరిమానాలు, శిక్షలు సహా పలు కీలక అంశాల్ని చేర్చారు. ఆధార్ గోప్యతను కాపాడటంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఆధార్ ఉల్లంఘనలపై చర్యల కోసం నియమించే న్యాయాధికారులు కేంద్ర ప్రభుత్వంలో కనీసం జాయింట్ సెక్రటరీ స్ధాయి అధికారి ఉండాలని, కనీసం పదేళ్ల సర్వీసు ఉండాలని, ఐటీ, కామర్స్, మేనేజ్ మెంట్ , న్యాయ రంగాల్లో కనీసం మూడేళ్ల పాలనా పరమైన లేదా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా నియమించిన న్యాయాధికారులు ఆధార్ ఉల్లంఘలపై నిందితులకు తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసే అధికారం కల్పించారు. అలాగే విచారణలకు హాజరు కావాలని సాక్ష్యులకూ నోటీసులు జారీ చేసే అధికారమిచ్చారు.












Click it and Unblock the Notifications