ఎన్నికల వేళ.. కేంద్రం చేతికి బ్రహ్మాస్త్రం
CAA: దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.
రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ స్పష్టతను ఇచ్చిందంటూ వార్తలు వెలువడుతున్నాయి.

ఈ రాత్రికే పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకుని రావడానికి హోం మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీఐఐ మార్గదర్శకాలను నోటిఫై చేయబోతోందని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రాత్రికే విడుదల కానున్నాయనే ప్రచారం దేశ రాజధానిలోన విస్తృతంగా సాగుతోంది.
రెండు, మూడు రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉండటం వల్ల అంతకంటే ముందే ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోన్న నేపథ్యంలో- వాటి మార్గదర్శకాలను కేంద్రం నోటిఫై చేయాలనే పట్టుదలతో ఉన్నట్టే కనిపిస్తోంది.
2014 డిసెంబర్కు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతరులు అంటే హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వాన్ని కల్పించాలనే ఉద్దేశంతో 2019లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

అప్పట్లో దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఆందోళనలు చోటు చేసుకున్నాయి. రోజుల తరబడి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగాయి. దీనితో అప్పట్లో దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం.
సీఏఏకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలను సైతం చేశాయి. వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి. ఈ జాబితాలో తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కేరళ ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడు కూడా సీఏఏ అమలుకు పెద్దగా సుముఖంగా లేదు.












Click it and Unblock the Notifications