డ్రగ్స్ కేసులపై కేంద్రం కీలక నిర్ణయం- తక్కువ మొత్తంలో తీసుకునే వాళ్లకు ఊరట
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం పెరుగుతోంది. దేశీయంగా తయారవుతున్న డ్రగ్స్, గంజాయికి తోడు విదేశాల నుంచి వస్తున్న హెరాయిన్ వంటి డ్రగ్స్ ఇప్పుడు దేశ భవిష్యత్తుకు సవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక మంత్రిత్వశాఖ రెవెన్యూశాఖకు కీలక సూచన చేసింది. డ్రగ్స్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ శాఖ ఈ మేరకు సూచనలు చేయాలని కోరడంతో సామాజిక మంత్రిత్వశాఖ తన అభిప్రాయం చెప్పింది.
దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న మొత్తంలో వ్యక్తిగతంగా డ్రగ్స్ తీసుకుంటున్న వారినీ, భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకిుంటూ,రవాణా, వ్యాపారానికి సహకరిస్తున్న వారినీ ఒకే గాటన కట్టడాన్ని సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ తప్పుబట్టింది. ఈ మేరకు చిన్న మొత్తంలో సొంతానికి డ్రగ్స్ తీసుకుంటున్న వారిని నేర రహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూశాఖకు పలు సూచనలు చేసింది. ఈ సూచనలు అమలైతే చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారు ఇకపై జైలు ఊచలు లెక్కించాల్సిన అవసరం ఉండదు.
చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసుకునే వారిని నేర రహితంగా మార్చే క్రమంలో వారిని జైళ్లకు పంపే బదులు డీఅడిక్షన్ సెంటర్లకు, పునరావాస కేంద్రాలకు పంపాలని సామాజిక న్యాయమంత్రిత్వశాఖ రెవెన్యూ శాఖను కోరింది. ఈ మేరకు ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ చట్టం NDPSలో సవరణలు చేయాలని ప్రతిపాదించింది.
ఇలా చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసుకునే వారిని సైతం జైళ్లకు పంపడం మొదలుపెడితే దేశంలో పెను మార్పులు తప్పవని హెచ్చరించింది. ఓవైపు డ్రగ్స్ తయారు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు చిన్న మొత్తాల్లో వ్యక్తిగతంగా వాడే వారిని డీఅడిక్షన్ సెంటర్లు, పునరావాస కేంద్రాలకు పంపడం ద్వారా డ్రగ్స్ కల్చర్ కు అడ్డుకట్ట వేయాలని సామాజిక న్యాయమంత్రిత్వశాఖ సూచిస్తోంది. దీంతో కేంద్రం ఇప్పుడు ఈ సూచనల్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.