బ్లాక్ మనీ ఖాతాదారులు వీరే!: అకౌంటే లేదని స్పందన..
న్యూఢిల్లీ: నల్లధనాన్ని పోగేసిన ముగ్గురు ఖాతాదారుల వివరాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది. ఈ ముగ్గురిలో రాజకీయ నేతలు ఎవరు లేరు. మరింతమంది ఖాతాదారుల పేర్లను ఈ కేసులో ప్రాసిక్యూషన్ మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించనుంది.
ఈ రోజు సుప్రీంకు సమర్పించిన నల్లధనం కుబేరుల జాబితాలో.. డాబర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, రాజ్కోట్కు చెందిన పారిశ్రామికవేత్త పంకజ్ చిమన్ లాల్, గోవాకు చెందిన గనుల యజమాని రాధా ఎస్ టింబ్లో పేర్లు ఉన్నాయి. చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక అన్ని పేర్లను వెల్లడిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.
అకౌంట్ ఉందని కేంద్రం పేర్కొన్న వారి స్పందన
తనకు అసలు స్విస్ బ్యాంకులో అకౌంటే లేదని పంకజ్ తెలిపారు. తన రికార్డులు అన్నింటిని అధికారులకు చూపించానని చెప్పారు. సుప్రీం కోర్టులో తాను సమాధానం చెబుతానన్నారు. తమ మాజీ ఈడీ ప్రదీప్ ఎన్నారైగా ఉన్నప్పుడు స్విస్ బ్యాంకులో చట్టబద్దమైన అకౌంట్ తెరిచారని డాబర్ తెలిపింది.
వారి పేర్లే ఎందుకో తెలియదు: సుబ్రహ్మణ్య స్వామి
కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముగ్గురు నల్లధనం ఖాతాదారుల పేర్లు సుప్రీంకోర్టు వెల్లడించడంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. నల్లధనం ఖాతాదారుల అందరి పేర్లు బయటపెట్టేందుకు చట్టంలో ఎలాంటి అడ్డంకులు లేవని కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు సెలక్టివ్ గా వారి పేర్లే బహిర్గతం చేసిందో తెలియదని పేర్కొన్నారు. అయితే, విదేశాల్లోని నల్లధనాన్ని మోడీ ప్రభుత్వం వెనక్కి రప్పిస్తుందని ఆయన చెప్పారు. జాబితా మొత్తం బయటకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, నల్లధనం పేర్ల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల మాట్లాడుతూ.. పేర్లు బయట పెడితే కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది అని వ్యాఖ్యానించారు. నల్లధనం కుబేరుల జాబితాలో యూపీఏ మంత్రి ఒకరు ఉన్నట్లు పరోక్షంగా పేర్కొన్నారు. దీని పైన కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది.
స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపాదనను దాచుకున్న వ్యక్తుల జాబితా విడుదలపై తామేమీ భయపడటం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం మూడు రోజుల క్రితం అన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ కొత్తగా చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
విదేశాల్లో నల్లధనం దాచిన వారి జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై పి. చిదంబరం పై విధంగా స్పందించారు.
‘జాబితాలో పేర్లున్న వ్యక్తులు భయపడతారు తప్పించి, పార్టీ ఎందుకు కలవరపడుతుంది? ఈ తరహా అక్రమాలు వ్యక్తిగతమైనవి' అని చిదంబరం వ్యాఖ్యానించారు. ‘బ్లాక్ మనీ జాబితా వెల్లడిలో బీజేపీ కూడా మా మాదిరే వ్యవహరిస్తోంది. న్యాయపరంగా సర్కారు నిర్ణయం సరైనదే. అయితే మాపైనే తిరిగి నిందలేస్తూ తప్పు చేస్తోంది' అని చిదంబరం అన్నారు.
బ్లాక్ మనీ జాబితాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ విలేకరులతో మాట్లాడుతూ తమను బెదిరించడానికి ప్రయత్నించవద్దని సూచించింది. నల్లధనం వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అటువంటి వారి పేర్లన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేసింది. అంతేకానీ ప్రతీకారచర్యలకు అవకాశంగా తీసుకోకూడదని హితవు పలికింది. అర్థసత్యాలతో సరిపెట్టవద్దని చెప్పారు.












Click it and Unblock the Notifications