మరో 2 కోట్ల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్- కేంద్రం ప్రయత్నాలు-80 కోట్ల మందికి లబ్ధి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. తద్వారా మరో 2 కోట్ల కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ పథకం అమలు కోసం ప్రామాణికంగా తీసుకుంటున్న సామాజిక, కుల జనాభా లెక్కలకు అదనంగా ఇతర గణాంకాలను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.
ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భాత్ పథకం ప్రపంచంలోనే ప్రభుత్వ-నిధులతో అమలవుతున్న అతిపెద్ద ప్రజారోగ్య బీమా పథకం. ఇప్పటికే ఇందులో 10.76 కోట్ల పేద, బలహీన వర్గాలు కుటుంబాలు లబ్దిదారులుగా ఉన్నాయి. లబ్దిదారుల సంఖ్య పరంగా చూస్తే ఇది 50 కోట్ల పైమాటే. ఈ పథకం కింద రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ గా ఇస్తున్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం అమలు ఏజెన్సీగా జాతీయ హెల్త్ అథారిటీ ఉంది. ఇది సామాజిక, కుల జనాభా గణాంకాల ఆధారంగా లబ్దిదారుల్ని ఎంపిక చేస్తోంది. వీరికి మాత్రమే ఈ పథకం లబ్ది అందుతోంది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కవరేజీని దాదాపు రెండు కోట్ల అదనపు కుటుంబాలకు విస్తరించే ప్రణాళికలకు కేంద్ర మంత్రివర్గం త్వరలో ఆమోదించే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గతేడాది నవంబర్ నాటికి, జాతీయ హెల్త్ అథారిటీ ఎన్.హెచ్.ఏ దాదాపు 17 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల్ని పంపిణీ చేసింది. ఇందులో 10.66 కోట్ల PM-JAY కార్డ్లు, 5.85 కోట్ల స్టేట్ కార్డ్లు ఉన్నాయి.
ఎన్హెచ్ఏ ఈసారి జాతీయ ఆహార భద్రతా చట్టం వంటి ఇతర డేటాబేస్లను పరిశీలిస్తుందని, ఈ పథకం లక్ష్యం లబ్ధిదారులందరికీ చేరేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా మార్పులు అమల్లోకి వస్తే 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం రేషన్ కార్డ్ జాబితాలో పాటు, ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన డేటాబేస్లను కూడా పరిశీలిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన డేటాబేస్ను కూడా పరిగణనలోకి తీసుకుంటాని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.